– ఆసరా కోసం పేదల ఎదురుచూపులు
– టీవీఎచ్ఎస్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు నాగరాజ్
బీబీనగర్, మార్చి 13 : రాష్ర్టంలో ఆసరా పింఛన్ల కోసం పేదలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుండి స్పష్టమైన నిర్ణయం రావడం లేదని టీవీఎచ్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో పాటు పాత పింఛన్ల పెంపు కూడా జరగకపోవడంతో అర్హులు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 2024- 25లో రెండు దఫాలుగా సుమారు 24.85 లక్షల కొత్త దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటి వరకు అర్హులను ఎంపిక చేసి పింఛన్లు మంజూరు చేయలేదన్నారు.
ఇదే సమయంలో వివిధ కారణాలతో దాదాపు 2 లక్షల పింఛన్లు రద్దు చేశారని ఆరోపించారు. 2023- 24 గణాంకాల ప్రకారం రాష్ర్టంలో 44,49,767 మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారని, వీరిలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, వ్యాధిగ్రస్తులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పింఛన్లను రూ.6,016కు, మిగతా పింఛన్లను రూ.4,016కు పెంచాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. జీఓ నంబర్ 17 పేరుతో ఆదాయ పరిమితి విధించి పింఛన్లను తగ్గించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.