ఆలేరు టౌన్, ఆగస్టు 19 : గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆలేరు మండల కేంద్రంలోని సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, క్రాంతి నగర్, భారత్ నగర్ కాలనీలతో పాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో మగ్గం మూగబోయింది. ఆలేరు మండలంలో సుమారు 400 చేనేత కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి. భార్యాభర్తలు ఇరువురు కష్టపడితే నెలకు రూ.15 వేల కూలీ లభిస్తుంది. నిరంతరం ముసురు కురుస్తుండడంతో మగ్గం నడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య ఖర్చులకు అవస్థలు పడుతున్నారు. ఇటీవల బెంగళూరులో కురుస్తున్న వర్షాలకు మలబరీ పంట దెబ్బతింది. దీంతో పట్టు దారం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో పట్టు దారం ధర పెరిగింది. పెరిగిన పెట్టుబడి మేరకు ఆదాయం సమకూరకపోవడంతో చీరల తయారీదారులు, చేనేత కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాల వల్ల కొన్ని నెలలుగా పోచంపల్లి పట్టు చీరల విక్రయాలు క్రమంగా పడిపోవడంతో చేనేత కళాకారులు పని దొరకక పస్తులు ఉండే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన చేనేత కళాకారులకు సబ్సిడీపై రుణాలను మంజూరు చేయాలి. ఇంతకుముందు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేశాం అని చెబుతుంది. బ్యాంక్ అధికారులు రుణాలను కట్టాలని కార్మికులపై ఒత్తిడి పెంచుతూ నోటీసులు పంపడం దారుణం. చేనేత కార్మికుడు చనిపోతే గతంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పది రోజుల్లో కార్మికుడి ఖాతాలో జమయ్యేది. కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో తెలియడం లేదు. ప్రభుత్వం చేనేత కళాకారులను ఆదుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, ఆప్కో ద్వారా వస్త్రాలను కొనుగోలు చేస్తామని ఇచ్చిన మాటను తుంగలో తొక్కింది. చేనేత దినోత్సవం రోజున హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.33 కోట్లు విడుదల చేసినం అని చెప్పినా నేటికీ ఏ ఒక్క చేనేత కళాకారుడికి రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి చేనేత కళాకారులను ఆదుకోవాలి.