ఆలేరు టౌన్ : తాము శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే ఆలేరు పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యూత్ నాయకులు మండిపడ్డారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ యూత్ నాయకులను నిద్ర లేవకముందే వారి ఇళ్లలోకి వెళ్లి ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సమాజంలోని ప్రతి వ్యక్తికి నిరసన తెలిపే హక్కును కల్పిస్తే.. ఆ స్వేచ్ఛా హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడడటానికి స్వేచ్ఛ లేదని, నిరసన తెలిపే స్వేచ్ఛ లేదని, ప్రజా పాలన అంటే ఇదేనా అని బీఆర్ఎస్ యువ నాయకులు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మండల యూత్ విభాగం అధ్యక్షుడు అయిలి కృష్ణ గౌడ్, బీఆర్ఎస్ యూత్ నాయకులు జింకల రామకృష్ణ, కోనాపురం నాగరాజు, నవీన్, సోషల్ మీడియా కన్వీనర్ కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, ఎం.డీ జమాల్, టింకు తదితరులు ఉన్నారు.