భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 28 : విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం పోచంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయం, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. బాలికల వసతి గృహంలోని విద్యార్థినుల నివాస సదుపాయాలు, భోజన వసతి, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. గదుల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు.
విద్యార్థినులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని కస్తూర్బా విద్యాలయంలో ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు అధికారులు చర్య తీసుకోవాలని సూచించారు. అనంతరం చేనేత సహకార సంఘం, కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ను ఆయన సందర్శించి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను పరిశీలించారు. చిటికి చుట్టడం, రంగుల అద్దకం, మగ్గాలపై వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. చేనేత కళాకారులు నైపుణ్యం అద్భుతంగా ఉందని కొనియాడారు. సాంప్రదాయ వారసత్వ చేనేత కళను పరిరక్షించుకోవాలని, మారుతున్న కాలానుగునంగా వినియోగదారుల అభిరుచుల మేరకు నూతన డిజైన్లు నాణ్యత, నవ్యతతో వస్త్రాలను రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు , డీఈఓ సత్యనారాయణ, హ్యాండ్లూమ్ ఏడీఓ బాల మోహన్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, సంఘ ప్రతినిధి సీత చక్రపాణి, ఎంఈఓ ప్రభాకర్, వార్డు ఆఫీసర్ చిలువేరు గీత, కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ ప్రతినిధి సాయిని భరత్, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి