భువనగిరి కలెక్టరేట్, జులై 07 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారాలు చూపాలన్నారు. సోమవారం నాటి ప్రజావాణిలో 48 అర్జీలను స్వీకరించగా అందులో రెవెన్యూ శాఖకు- 34, పంచాయతీ శాఖకు-5, వ్యవసాయ శాఖకు-2, గ్రామీణాభివృద్ధి శాఖకు-2, హౌసింగ్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపాలిటీ, జిల్లా సంక్షేమ శాఖ, ఇరిగేషన్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, బడిబాట, వన మహోత్సవం, ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించి మాట్లాడారు.
జిల్లాలో మొదటి విడతలో గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంకా పునాది తీసుకోని వారిని త్వరగా తీసుకునేలా మండల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు. బేస్మెంట్ తీసుకున్న వారికి ప్రతి సోమవారం రూ. లక్ష వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని, చాలా మంది ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నట్లు తెలిపారు.
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మొక్కలు నాటిన తర్వాత, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా మొక్క నాటిన వారిపై ఉందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు సోలార్ ప్లాంట్, ప్రెటోల్ బంక్లు, మహిళా శక్తి క్యాంటీన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.