– రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్
రామన్నపేట, ఫిబ్రవరి 05 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించి అనుమతులు లేకుండా గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్యులతో సమావేశమై ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందిస్తున్న మందులపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు.
అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం స్థానిక నాయకులు ఆయనను కలిసి ఆస్పత్రి భవనం శిథిల దశకు చేరుకుందని, నూతన భవనంను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని కోరారు. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పరిశీలనలో ఉందని ఈ సందర్భంగా ఆయన వారికి తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్నా నాయక్, వైద్యులు స్వాతి బాయి, నవీన్ సింగ్, మాధవచారి, దేవేందర్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

TVVP : విధులకు గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు