Telangana Decade Celebrations | యాదగిరిగుట్ట, జూన్ 20 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన దేవాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయి. గత పాలకులు స్వామివారి దర్శనానికి వచ్చి పులిహోర, దద్దోజనం తినిపోయారే తప్ప.. ఆలయంలో ఒక్క ఇటుకను కూడా మార్చలేదు. కానీ.. స్వరాష్ట్రంలో ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిధులు రూ.1,360 కోట్లు వెచ్చించి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానాన్ని అద్భుతంగా తీర్చదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష, స్తపతుల కఠోర శ్రమ, వైటీడీఏ, దేవస్థానం అధికారుల పర్యవేక్షణ, ఆర్ అండ్ బీ పనితీరుతో ఆరేండ్లలో పూర్తయిన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రపంచ చరిత్రలో నిలిచింది.
అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో నిర్మితమైంది. ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా, ఎన్నో వసతులను కల్పిస్తూ శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దారు. పూర్తి కృష్ణశిలతో నిర్మితమైన కట్టడం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనున్నది. 17.32 ఎకరాల్లో ఆలయ పునర్నిర్మాణాలను మహాద్భుతంగా చేపట్టారు. కొండపైన శివాలయం, ప్రసాద విక్రయశాల, ఎస్క్లేటర్తో కూడిన మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్, విష్ణు పుష్కరిణి నిర్మించగా..
ఆ పక్కనే బస్బే, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్, స్వాగత ఆర్చితోపాటు మెట్ల నిర్మాణం, ప్రధానాలయం పడమర భాగంలో వీవీఐపీ అతిథి గృహం, ఈఓ కార్యాలయం, కారు పార్కింగ్, వీవీఐపీ పార్కింగ్ నిర్మించారు. గతంలో కేవలం 1.30 ఎకరాల్లో ఉన్న యాదగిరీశుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాలకు పెరిగింది. వీటితోపాటు శివాలయం, పుష్కరిణి, ప్రసాద విక్రయశాల నిర్మాణం, భక్తుల మౌలిక వసతుల కల్పన ఏర్పాటుతో యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణాలు మరింత విస్తరించాయి. చక్కటి ఆకృతులతో, స్వర్ణవర్ణాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా క్యూ లైన్ల నిర్మాణాలు సాగాయి.
ప్రాచీన కాలంలో చేపట్టిన నిర్మాణాల్లో వాడిన గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనప నార గుజ్జు మిశ్రమాన్ని ఉపయోగించారు. ఈ మిశ్రమాన్ని బెంగళూరులోని బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరీక్షించి సర్టిఫై చేసి, ఐఎస్ కోడ్లకు అనుగుణంగా వీటి పరీక్షలు నిర్వహించారు. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీ పుష్కరిణి, నిత్యన్నదాన భవనంతోపాటు ఘాట్ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొండకు ఉత్తర ప్రాంతంలో భక్తుల సౌకర్యాల నిమిత్తం అద్భుతమైన నిర్మాణాలు చేపట్టగా అందుబాటులోకి వచ్చాయి.
కొలనుపాక అస్థిత్వాన్ని కాపాడేలా..
కొలనుపాక అస్థిత్వాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. రూ.1.79 కోట్లు మంజూరు కాగా, వైటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. ఆలేరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో శైవ, జైన ఆలయాలతో అలరారుతూ పర్యాటకులను ఆకట్టుకున్న కొలనుపాక శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే విగ్రహాలు, శాసనాలను కాపాడేందుకు, ఆ ప్రాంతపు నిర్మాణాలను పదిల పరిచేందుకు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను పునర్నిర్మించి ఆధునీకరిస్తున్నారు. కొలనుపాక చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి.
క్రీ.శ. 5-15 శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, గజలక్ష్మి ధ్వజస్తంభం, చాముండి, నటరాజు, భైరవుడు, నాగశిల్పం, సప్తమాతృకలు, వీరభద్రుడు, భద్రకాళి, ఆరో విక్రమాదిత్యుడి శాసనాలు, 1085 సంవత్సరం నాటి తొండర చోళ్ల రాజు శాసనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. చండీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ రాజుల కాలంలో సోమేశ్వర, వీర నారాయణ స్వామి ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయంలో శివలింగం స్వయంభువుగా ప్రసిద్ధి గాంచింది. శివరాత్రికి ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. కొలనుపాక జైనులకు తీర్థయాత్ర స్థలంగా పేర్కొంటూ కోగలి తీర్థ శానసం చెబుతుంది. ఏటా ఇక్కడ జరిగే మహావిరుడి జయంతి, రథోత్సవానికి దేశ, విదేశాల నుంచి జైనులు తరలివస్తారు.