యాదాద్రి భువనగిరి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం కేసీఆర్ చలువతో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. మూడోసారి కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ సారి హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతా. కేసీఆర్ బలం, భువనగిరి ప్రజలే నా బలగం. ఇప్పటికే రూ.3వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీలను అద్దంలా తీర్చిదిద్దాం. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగాల్లో ఇంకింత ప్రగతిని పరుగులు పెట్టిస్తా. అతి త్వరలోనే నృసింహసాగర్ పనులు పూర్తిచేసి, కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కించేందుకు ప్రయత్నిస్తా. భువనగిరిలో బీఆర్ఎస్కు సాటి లేదు. ప్రజలకు అందుబాటులో ఉంటా.. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే..
రూ.3వేల కోట్లతో అభివృద్ధి..
నేను 2014 కంటే ముందు భువనగిరికి వచ్చినప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఉమ్మడి పాలకుల హయాంలో కనీసం నిధులు సమకూరిన పాపాన పోలేదు. ఏ మాత్రం అభివృద్ధికి నోచలేదు. నాలుగు మండలాలదీ అదే పరిస్థితి. కనీస సదుపాయాలు లేవు. నేను ఏ గ్రామానికి పోయినా మట్టి రోడ్లే కనిపించేవి. కానీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో మార్పు వచ్చింది. ఇప్పుడు 90 శాతం సీసీ రోడ్లు వేయించినం. సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులతో నాలుగు మండలాలను అభివృద్ధి చేశాను. సీఎం, మంత్రి కేటీఆర్తో పట్టుబట్టి ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన. ఆస్పత్రిలో అనేక రకాల సేవలను అందుబాటులోకి తెచ్చాం. చెరువులను బాగు చేసినం. చెక్డ్యామ్లు, బ్రిడ్జిలు నిర్మించాం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చినం.
అద్దంలా మున్సిపాలిటీలు..
భువనగిరి, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలను అన్నివిధాలుగా అభివృద్ధి చేశాం. ఇంకా కొన్ని పనులు నడుస్తున్నాయి. పట్టణంలోని గల్లీగల్లీకి సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించాం. అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశాం. పట్టణ ప్రగతి కింద పార్కులు, క్రీడాప్రాంగణాలు, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటుతోపాటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. భువనగిరి పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దినం. పోచంపల్లి అభివృద్ధిని చూసి కేటీఆర్ ఫిదా అయ్యారు. నెల రోజుల్లో పోచంపల్లి మున్సిపాటీలో పనులన్నీ పూర్తవుతాయి.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నది. నాడు దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా సాగుతుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ చేసి కిసాన్ సర్కారు అనిపించుకుంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, దళితబంధు, నేతన్న బీమా, బీసీ, మైనార్టీలకు లక్ష సాయం, గృహలక్ష్మి, పంచాయతీ కార్మికులకు బీమా, చేనేత మగ్గం తదితర అనేక పథకాలు అమలువుతున్నాయి. ఈ పథకాలే తనను గెలిపిస్తాయి.
బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా ఏ పార్టీకీ లేదు
భువనగిరి నియోజకవర్గంలో గులాబీ పార్టీకి సాటి లేదు. బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా ఏ పార్టీకీ లేదు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మాకు కేడర్, ప్రజలపై ఉన్న నమ్మకం. నాపై కేసీఆర్, కేటీఆర్ ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. భారీ మెజార్టీతో గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తా.
త్వరలోనే నృసింహసాగర్కు కాళేశ్వరం జలాలు..
బీఆర్ఎస్ పాలనలో రైతు బాగుండాలనేదే కేసీఆర్ లక్ష్యం. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించారు. కాళేశ్వరం జలాల కోసం మన దగ్గర నృసింహసాగర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. కాల్వ పనులు కూడా పూర్తికావచ్చాయి. రిజర్వాయర్ ముంపు బాధితులను అన్ని విధాలుగా అదుకుంటున్నాం. ఇప్పటికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తయ్యింది. భూనిర్వాసితులకు కూడా నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి.. కాళేశ్వరం జలాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్లో నృసింహసాగర్ రిజర్వాయర్ పెద్ద టూరిస్ట్ ప్రాంతంగా మారనున్నది.
నియోజకవర్గ ప్రజలే బలం..
రెండు పర్యాయాలు గెలిచినప్పటికీ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. అందరికీ అందుబాటులో ఉంటూ.. నిత్యం సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నా. నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయాయి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాక వాటన్నింటినీ పరిష్కరిస్తా. నియోజకవర్గ ప్రజలే నా బలం. కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.