యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామం రైతు వేదిక క్లస్టర్ హాల్లో నిర్వహించిన రైతుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం తెలంగాణలో ఏ దుకాణానికి వెళ్లినా చెప్పుల లైన్లు దర్శనమిచ్చేవని తెలిపారు. రోజుల తరబడి లైన్లలో నిల్చున్నా రైతులకు ఎరువులు దొరికేవి కావని, సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే కేంద్రాన్ని నిలదీసి తెలంగాణకు వచ్చే ఎరువుల వాటాను పెంచి సకాలంలో రైతులకు ఎరువులను అందిస్తున్నామన్నారు.
రైతాంగ సమస్యలమీద, వ్యవసాయ రంగం పై ఏమాత్రం అవగాహనలేని రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం అతడి అజ్ఞానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని లేకుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనిచ్చే ప్రసక్తి లేదని రైతులు సమావేశంలో తీర్మానించారు.