యాదాద్రి భువనగిరి : ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృసింహ సాగర్(బస్వాపూర్ రిజర్వాయర్) ముంపు గ్రామం బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్తులకు భువనగిరి మున్సిపాలిటీ పరిధి హుస్నాబాద్ వద్ద కేటాయించిన పునరావాస స్థలాల ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని త్యాగం చేసిన బి.ఎన్. తిమ్మాపూర్ గ్రామస్తులకు మనందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి త్యాగం వల్లనే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందన్నారు. గ్రామంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికి ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశామని చెప్పారు. మొత్తం 93 ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించి పట్టాలు అందజేశామన్నారు. బి.ఎన్. తిమ్మాపూర్ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి పెద్దకొడుకులా నిరంతరం వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.