యాదాద్రి జిల్లాలో మోత్కూరు మండలం ధర్మారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా మరణించిన చంద్రమౌళి అనే వ్యక్తి కుటుంబ సభ్యులు.. ఆందోళనకు దిగారు. రాములమ్మ అనే మహిళ కుటుంబమే ఈ హత్య చేయించిందంటూ మృతుడి కుటుంబం ఆందోళన చేసింది.
శనివారం నాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రమౌళి అనే వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. ఇదే క్రమంలో ఆదివారం నాడు గ్రామ శివారులో చంద్రమౌళి మృతదేహం కనిపించింది. దీంతో రాములమ్మ కుటుంబమే అతని మరణానికి కారణమంటూ చంద్రమౌళి బంధువులు ఆరోపించారు. రాములమ్మ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
చంద్రమౌళి బంధువుల్లో ఒకరు రాములమ్మ ఇంటి ముందు ఒంటికి నిప్పంటిచుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళన కారులను చెదరగొట్టారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రాములమ్మ, ఆమె భర్త హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.