– అర్థరాత్రి క్రికెట్ బ్యాట్, వికెట్లతో దాడి
– రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘటన
– దాడి దృశ్యాలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్
– ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
రాజాపేట, డిసెంబర్ 02 : అందరూ నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు చితకబాది గాయపరిచారు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడంతో సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన విద్యార్థి రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థిపై ఇంటర్ చదువుతున్న విద్యార్థులు శనివారం అర్ధరాత్రి క్రికెట్ బ్యాట్, వికెట్లతో దాడి చేశారు. విద్యార్థిని చితకబాదుతున్న దృశ్యాలను తోటి విద్యార్థి సెల్ ఫోన్లో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇన్స్టాలో చూసిన బంధువు విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపడంతో వారు వచ్చి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగినా కూడా విద్యార్థి తల్లిదండ్రులకు తెలపకపోవడంతో వారితో పాటు బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ తోపాటు ఉపాధ్యాయులను మూడు గంటల పాటు నిలదీస్తూ దాడి చేసిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గురుకులంలో ఉత్తమ బోధన అందిస్తారని నమ్మి తమ కొడుకును పంపించామని, ఇంత దారుణంగా సీనియర్ విద్యార్థులు దాడి చేస్తే గురుకుల ఉపాధ్యాయులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పాఠశాలలో పర్యవేక్షణ, క్రమశిక్షణ పూర్తిగా లోపించడం వల్లే విద్యార్థులు ఇలా బరితెగించి తోటి విద్యార్థులపై దాడి చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. ఘటన జరిగిన సమయంలో తాను సెలవుల్లో ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విషయం తమ దృష్టికి రాగానే వెంటనే విద్యార్థిపై అకారణంగా దాడి చేసిన గాయపరిచిన ఏడుగురు ఇంటర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు.