ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్,
టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, వీవీఐపీల విడిది
భువనగిరిలో లక్షమందితో బహిరంగ సభ
స్వాగత తోరణాలు, కటౌట్లతో భారీ ఏర్పాట్లు
దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సభను విజయవంతం చేయాలని పిలుపు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తున్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి, ఉద్యమాల పురిటి గడ్డ భువనగిరిలో పర్యటించనున్నారు. యాదాద్రిలో రూ.143.08కోట్లతో నిర్మించిన వీవీఐపీల విడిది, భువనగిరి జిల్లా కేంద్రంలో రూ.53.20కోట్లతో సిద్ధమైన సమీకృత కలెక్టరేట్, రూ.1.20కోట్లతో రూపుదిద్దుకున్న టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం సభ నిర్వహణ, జన సమీకరణకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పూర్తి చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. మంత్రి జగదీశ్రెడ్డి వారం రోజులుగా భువనగిరిలోనే ఉంటూ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలుకడంతోపాటు సభను జయప్రదం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశాయి.
జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో ముఖ్యమంత్రి బహిరంగ సభా స్థలిని శుక్రవారం ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రజలకు అన్నివిధాలా మేలు జరిగిందన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఏడున్నరేండ్లలో జరుగడంతో బీజేపీ పాలకులు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరిపాలనా సౌలభ్యం కోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతవాసుల దశాబ్దాల జిల్లా ఆకాంక్షను నెరవేర్చారని, కొత్త జిల్లాలో అభివృద్ధికి చిహ్నాలుగా ఎన్నో పనులు నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు, కనీవిని రీతిలో భువనగిరిలో సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఎస్ఎస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, డాక్టర్ గాదరి కిశోర్కుమార్, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పూర్తి చేశాయి. శనివారం మధ్యాహ్నం యాదాద్రికి ముఖ్యమంత్రి చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భువనగిరిలోని కొత్త కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. కలెక్టరేట్ను ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం భోజనం చేసేందుకు కలెక్టరేట్లోనే ఏర్పాట్లు చేశారు. భోజన విరామం తర్వాత భువనగిరి బైపాస్ రోడ్డులోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణలో పాల్గొని అక్కడే పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
భారీ ఫ్లెక్సీలు.. స్వాగత తోరణాలు
సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ భవనాన్ని పూలతో అందంగా ముస్తాబు చేశారు. యాదాద్రి నుంచి రాయగిరి మీదుగా భువనగిరికి సీఎం రోడ్డు మార్గంలో వచ్చే దారిలో.. కలెక్టరేట్ నుంచి టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి వెళ్లే దారిలో హైదరాబాద్- వరంగల్ హైవేపై సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీలను, స్వాగత తోరణాలను, భారీ బెలూన్లను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల నుంచి బైక్ ర్యాలీలతో నేరుగా సభా ప్రాంగణానికి వచ్చేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నాయి.
విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న భవనాలు
సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్న ప్రెసిడెన్షియల్ సూట్, కలెక్టరేట్, టీఆర్ఎస్ పారీ జిల్లా కార్యాలయం విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్నాయి. ఇప్పటికే ఆయా భవనాలను అన్ని హంగులతో ముస్తాబు చేశారు. పచ్చని చెట్లు.. రంగురంగుల పూల మొక్కలు.. విద్యుత్ కాంతుల్లో భవనాల ప్రాంగణాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, పార్టీ శ్రేణులు వారం రోజులుగా తీవ్రంగా శ్రమించారు. రాయగిరి వద్ద నిర్మించిన నూతన కలెక్టరేట్లో అన్నిశాఖలు ఒకే చోటకు రానుండడంతో పాలనా సౌలభ్యం కలిగి ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారనున్నది. అలాగే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం అందుబాటులోకి రానుండడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఇబ్బందులు తీరనున్నాయి. యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్ల ప్రారంభంతో స్వామి దర్శనానికి వచ్చే వీవీఐపీలకు ఈ అధునాతన సూట్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
నూతన కలెక్టరేట్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాయి. వారం రోజుల ముందే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి జన సమీకరణకు సంబంధించి కార్యాచరణను రూపొందించి అమలు చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. ఒకటి, రెండు మండలాలకు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జీలుగా నియమించారు. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జన సమీకరణ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జన సమీకరణలో జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం నుంచి జనాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగడం.. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందడంతో సీఎం సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు వివిధ వర్గాల ప్రజలు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.
ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు
బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య నెలకొనకుండా పార్కింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నలువైపులా ఐదు ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేశారు. భువనగిరి, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల నుంచి వచ్చే వాహనాలను సభా వేదికకు ఎడమ వైపున, ఎదురుగా రెండు చోట్లా పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. నల్లగొండ రోడ్డు మార్గం నుంచి వచ్చే వాహనాల కోసం హైదరాబాద్-వరంగల్ హైవే వెంట ఉన్న దీప్తి హోటల్ వెనుక వైపున పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలేరు నుంచి వచ్చే వాహనాలకు రాయగిరి ఫ్లైఓవర్ కంటే ముందుగానే పెట్రోల్ బంక్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి మార్గంలో వచ్చే వాహనాలు నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు..
సీఎం పర్యటన సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును సెక్టార్లుగా విభజించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ముగ్గురు డీసీపీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. 12 మంది ఏసీపీలు, 42 మంది సీఐలు, వంద మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాస్లను జారీ చేశారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే సీఎం పర్యటన ప్రాంతానికి అనుమతిస్తారు. బందోబస్తు చర్యల్లో భాగంగా సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో బందోబస్తు చర్యలను పరిశీలించారు. బందోబస్తుపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం సభను విజయవంతం చేయాలి ;ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 11: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలిరావాలని సూచించారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతున్నది. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఏడున్న రేండ్లలో సాధ్యమవడంతో బీజేపీ పాలకులు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త కలెక్టరేట్ అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాం. కనీవిని రీతిలో భువనగిరిలో సభను నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి.
– విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి