– రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మార్చాలి
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్
– ప్రారంభమైన సిపిఎం నిర్వదిక నిరాహార దీక్షలు
రామన్నపేట, మార్చి 16 : రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు ముందు ప్రారంభించడం జరిగింది. సిపిఎం మండల నాయకులు 8 మంది దీక్షలో కూర్చోగా వారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లేక అశోక్ రెడ్డి పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు లేక ఈ ప్రాంత ప్రజలకు ప్రజా వైద్యం అందకుండా పోతుందని, అత్యవసర పరిస్థితి వస్తే దూర ప్రాంతాలకు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నియోజకవర్గ కేంద్రంగా 8 మండలాల గ్రామాల ప్రజలకు 56 సంవత్సరాల నుండి వైద్య సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రి నేడు పరిమితమైన పాత భవనంలో ఎప్పుడు కోలుతుందో తెలియని ప్రమాదపు అంచుల్లో ఉందన్నారు. ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదన్నారు. 50 పడకల కోసం అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శిలాఫలకం వేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కనీసం నిధులు రాక దుర్భర పరిస్థితిలో ఉందన్నారు.
ఈ ప్రభుత్వాసుపత్రి ప్రథమ చికిత్స, పోస్టుమార్టంలకే పరిమితమైంది తప్ప పేదలకు వైద్యం అందడం లేదని వాపోయారు. ప్రతిరోజు 400 మంది ఔట్ పేషెంట్లు వైద్యం కోసం వస్తారని రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందన్నారు. గర్భిణీలకు కనీసం స్కానింగ్ లేకపోవడంతో ప్రతిసారి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించి వంద పడకల నూతన భవనం నిర్మించి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రిపై స్పష్టమైన ప్రకటన చేసేదాకా నిరాహార దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జలల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర నరసింహ చారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, నాగటి ఉపేందర్, వేముల సైదులు, చానకొండ రాము ఉన్నారు. ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫజల్ బేగ్, నకిరేకంటి గణేశ్, దండగుల రాములు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు గాజుల ఆంజనేయులు సంఘీభావం తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కల్లూరి నగేష్, జంపాల అండాలు, మండల నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్, నీల అయిలయ్య, ఎండీ రషీద్, గాదె నరేందర్, ఆవనగంటి నగేష్, బొడిగె రజిత, తొలుపునూరి శ్రీనివాస్, మేడి గణేష్, శాఖ కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, తాళ్లపల్లి జితేందర్, పులి భిక్షం, గుండాల ప్రసాద్, గోగు లింగస్వామి, కొమ్ము అంజమ్మ, కూనూరు మల్లేశం, గన్నేబోయిన శ్రీనివాస్, ఆవనగంటి రవీందర్ పాల్గొన్నారు.

‘ప్రజా వైద్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు’