ఇంటింటా చెత్త సేకరణ,
ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం
ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా ఉన్న పల్లెలు నేడు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి. సరైన రోడ్లు, మురుకి కాల్వలు లేక అవస్థలు పడ్డ పల్లెటూర్లు ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించుకోని స్వచ్ఛతకు మారు పేరుగా నిలుస్తున్నాయి.
స్వచ్ఛత దిశగా: పల్లె ప్రగతికి ముందు గోలనుకొండ గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారంతో నిండి పోయి రోడ్లపై మురుగు పారుతూ.. నడువడానికి వీలు లేకుండా ఉండేది. నేడు సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతో గ్రామంలో స్వచ్ఛత ఏర్పడింది. గ్రామ పంచాయతీకి అందించిన ట్రాక్టర్, ట్రాలీ ద్వారా గ్రామం లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరణ అదే విధంగా హరితహరంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నారు.
తీరిన సమస్యలు: పల్లె ప్రగతిలో భాగంగా గోలనుకొండ గ్రామంలో ఏండ్ల నుంచి అపరిష్కృత్తంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. వైకుంఠధామం నిర్మించారు. పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు ఏర్పాటు చేసుకున్నారు. సీసీరోడ్లు, మురికి కాల్వలు నిర్మించారు. చెత్తను సేకరించేందుకు ఇంటింటికి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా మరమ్మతులు చేయించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుంది.