యాదగిరిగుట్ట, మే4 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం పట్టణంలో ప్రధాన రోడ్డుపై నిరసన ర్యాలీని చేపట్టారు. ఖబర్ధార్ అయిలయ్య, బీర్ల అయిలయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం ప్రధాన కూడళి వద్ద, అయిలయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్ శాఖ, ఆర్థికశాఖ, వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హోదాను మరిచి, అధిష్ఠానం మెప్పుకోసం నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. అధికారంలో ఉన్నమని విర్రవీగి నోరు జారితే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఇప్పటివరకు వరిధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో 30 శాతం వడ్లను కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులే కర్రకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎమ్మెల్యే అయిలయ్య వెంటనే హరీశ్ రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ మాజీ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం నాయకులు ముక్యర్ల సతీష్ యాదవ్, బాలయ్య, సర్పంచ్ గడ్డం దేవేందర్, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.