– ఏఐఎస్ఎఫ్ యాదాద్రి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 04 : కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేయడం సరికాదని, ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు వసూళ్లు చేసుకోమని చెప్పడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించాలని తీర్పు ఇవ్వడం సరైంది కాదని, అది పేద విద్యార్థుల చదువులకు గొడ్డలి పెట్టు లాంటిదని, తక్షణమే తీర్పును పున:సమీక్ష చేయాలని కోరారు.
ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారన్నారని, అలాంటిది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి మొట్టికాయలు వేయాలని, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చి విద్యార్థుల నుండి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజు బకాయిలు వసూళ్లు చేసుకోమని చెప్పడం దుర్మార్గమన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్నారని, ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 15 లక్షల పైచిలుకు మంది ఉన్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజు బకాయిలు రావడం లేదని పేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారన్నారు. పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ పని చేస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయిబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మారుపాక లోకేష్ జిల్లా నాయకులు రాంపాక చందు, సూరారం కళ్యాణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.