యాదాద్రి భువనగిరి : తెలంగాణ కోసం పోరాడిన నాడు.. భువనగిరి ఒక బెబ్బులిలా లేచిందని.. ఏరోజు కూడా తగ్గకుండా ఉద్యమంలో తన వెంట భువనగిరి ప్రజలు నడిచారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జిల్లాలోని రాయగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈసందర్భంగా మాట్లాడారు.
భువనగిరి జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలలో భాగంగా భువనగిరిని జిల్లాగా చేసుకున్నాం. ఈ జిల్లా చాలా కరువు ప్రాంతంగా.. చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది. కొంతమేరకు సమస్య పరిష్కారం అయింది. కాళేశ్వరం జలాలు ఇక్కడికి వచ్చాయి. బస్వాపూర్ రిజర్వాయర్తో సహా.. పునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్వారెడ్డి కాలువ అన్నీ పూర్తవుతాయి. సంపూర్ణంగా అన్ని గ్రామాలకు నీళ్లు లభిస్తాయి. ఇక్కడ పరిపాలనా భవనం ఈరోజు ప్రారంభించుకున్నందుకు జిల్లా ప్రతినిధులను, ప్రజలను అందరినీ అభినందిస్తున్నా.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
భువనగిరిలో అద్భుతమైన పోరాట కార్యక్రమాలు చేశారు. అద్భుతమైన ప్రజాయుద్ధం కొనసాగింది. తద్వారా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. సాంఘీక కార్యక్రమాలు కావచ్చు.. మంచినీళ్లు కావచ్చు.. ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. రైతు చనిపోతే రైతు బీమా ఎంత బాగా అందుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కండ్ల ముందు అన్నీ కనిపిస్తున్నాయి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇన్వెర్టర్లు లేవు.. జనరేటర్లు కూడా మాయం అయిపోయాయి. ఇవాళ మోటర్ కాలుడు లేదు.. ఎవరి ఇంట్లో బుగ్గ కాలడం కూడా లేదు. 24 గంటలు ప్రతి రంగానికి నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఆవిషయం కూడా మీ కళ్ల ముందనే ఉంది. అనేక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది. మనం కరెంట్ వాడేదానిలో తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. అనేక రంగాలలో.. ఎన్నో రాష్ట్రాలకు మనం ఆదర్శంగా ఉన్నాం. అనేక విషయాల్లో ముందుకు దూసుకెళ్తున్నాం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.