రాయగిరి నుంచి భువనగిరి రోడ్డు ఎలా ఉంది.. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పోయే రోడ్డులా ఉంది.. ఆ రోడ్డు ఇంతకుముందు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది. రేపు రాష్ట్రం కూడా అంతే. మీరు అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా సమన్వయం చేసుకుంటూ చేస్తున్న పనిని అలాగే కొనసాగించండి.. అంటూ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణను దేశమంతా మెచ్చుకుంటోంది. మీఅందరినీ కూడా ఇంకా గొప్పగా పరిపాలనలో పాత్ర వహించాలని కోరుతున్నాను.. అని సీఎం కేసీఆర్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం.. తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉందన్నారు.
మనం చేసిన కృషి ఇంకొద్ది రోజులు కొనసాగించాలి. చాలా గొప్ప రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం. ఎక్కడ ఉండే భూముల ధరలు మనకు తెలియవా. ఇదంతా మనందరి కృషి. హైదరాబాద్ సిటీలో ఒక విల్లా 25 కోట్లకు అమ్ముడుపోతోంది. ఎక్కడెక్కడో ఉన్నోళ్లు ఇక్కడికి వచ్చి కొంటున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు. ఒక సామరస్య పూర్వకమైన వాతావరణం ఇక్కడ ఉంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇక్కడ.. అని సీఎం అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్లో 50 శాతం సబ్సిడీ ఇస్తామంటే కంపెనీ పెడతరా. 100 శాతం ఇచ్చినా పెట్టరు. కానీ.. తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి. ఇక్కడ మనం కల్పించే ఫెసిలిటీలు అలా ఉన్నాయి. రోజూ 16 వేల గొర్రెలను అప్పట్లో దిగుమతి చేసుకునేవాళ్లం. ఇవాళ రాజస్థాన్ను తలదన్ని ఇండియాలో నెంబర్ వన్ గొర్రెలు పెంచే రాష్ట్రంగా తెలంగాణ మారింది.. అని సీఎం తెలిపారు.
ఇవాళ అద్భుతమైన భవనంలో నిలబడి మాట్లాడుతున్నాం. ఉషారెడ్డి అనే తెలంగాణ బిడ్డ ఈ భవనానికి ఆర్కిటెక్ట్. యాదాద్రి భువనగిరి జిల్లా బిడ్డే. తనే 33 జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలకు ఆర్కిటెక్చర్గా ఉంది. బ్రహ్మాండంగా తనే ఈ బిల్డింగ్లను నిర్మిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల కృషి కూడా తెలంగాణ అభివృద్ధిలో ఉంది. అందుకే మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. తెలంగాణలో ఉండే గ్రామాలు ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందాయి. మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ఇదివరకు జాగ లేకుండే. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక వైకుంఠదామం ఉంది. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్, ఒక డంప్ యార్డ్. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్.. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకొద్దిగా కృషిని కొనసాగిద్దాం.. అని సీఎం స్పష్టం చేశారు.