యాదాద్రి భువనగిరి : అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ.. నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అడిగినమా మేము అని అంటారా.. ఈ మాట అనొచ్చునా.. ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. మన హిందూ ధర్మం ఇదేనా.. మన దేశం మర్యాద ఇదేనా.. ఒక నేతను పట్టుకొని ఏం మాటలు మాట్లాడున్నారు.. ముఖ్యమంత్రి అలాంటివి అడుగుతారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జిల్లాలోని రాయగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంట్లో జరిగిన అవమానం గురించి ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ అనే ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనతో నాకు సంబంధం లేదు. కానీ.. వాళ్ల నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతం. చర్చ జరుగుతది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అడుగుతరు. ప్రజల తరుపున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతరు. రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారండి.. దయచేసి మీరు ఆలోచించాలి..నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది. ఒక ఎంపీని పట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. మహాభారతం, రామయణం, భగవద్గీత నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంటనే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి.. అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఓపికకు కూడా హద్దులు ఉంటాయి. ఎందుకు అంత అహంకారం. తమాషా చేస్తున్నారా? దేశం నాశనం అయితే ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ధర్మాన్ని, నిజాన్ని కాపాడటం కోసం.. న్యాయం పక్షాన నిలబడటానికి తెలంగాణ రాష్ట్రం పులిలా ఎప్పుడూ రెడీగా ఉంటది. ఎవరికి అన్యాయం జరిగినా.. సహించది. అది తెలంగాణ గడ్డలో, తెలంగాణ రక్తంలో ఉన్న పౌరుషం. మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తున్నా. తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా ప్రగతికాముక ప్రభుత్వం ఉండాలి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ మత పిచ్చి ప్రభుత్వం మనకు పనికిరాదు. అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్.. బీజేపీ గవర్నమెంట్. 8 ఏళ్లలో ఏ పని చేయలేదు. ఏ రంగంలో అభివృద్ది లేదు. జీడీపీ పతనం అయింది. ఆరోగ్య సూచీలు దెబ్బతిన్నాయి. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. డంబాచారం తప్పితే ఇంకేం లేదు. మంది మీద పడి ఏడ్చుడు.. మత పిచ్చి లేపుడు తప్పితే వీళ్లు సాధించింది ఏం లేదు. ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్క మూతి పిందె ఈ బీజేపీ పార్టీ. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే ఈ దేశానికి అంత మంచి జరుగుతది. హెచ్చరించడం.. చెప్పడం నా బాధ్యత. నా ధర్మం. ఈ దేశంలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి.. బాధ్యతలో ఉన్నాం కాబట్టి.. ధర్మం ప్రజలకు చెప్పే బాధ్యత ఉన్నది కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. మనం కూడా చైతన్యంగా ముందుకు వెళ్లాలి.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.