రామన్నపేట, అక్టోబర్ 15 : బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ రామన్నపేట మండల సిపిఐ పార్టీ, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బీసీ బిల్లు పాస్ అవకుండా చేసి, ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బీజేపీ ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్, సల్లా ఉపేందర్ పాల్గొన్నారు.