భువనగిరి అర్బన్, ఏప్రిల్ 06 : గృహ హింస బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం భువనగిరి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మహిళల సమస్యలను పరిష్కరించేందుకు భరోసా సెంట్రల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది 35వ కేంద్రం అని తెలిపారు. ఫోక్సో, లైంగిక వేధింపులు, గృహహింస బాధితులకు సైకాలజిస్టుల చేత సహాయం అందించేందుకు భరోసా సెంటర్ ఎంతో సహాయ పడుతుందన్నారు.
మహిళలకు జరుగుతున్న ఇబ్బందులు పోలీస్ స్టేషన్ లో నేరుగా చెప్పుకోలేరని, భరోసా సెంటర్లో ఉన్న సభ్యులతో తమ సమస్యలను చెప్పుకుంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గృహ హింసకు గురవుతున్న మహిళలు ఈ సెంటర్ను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖకు ఎదురవుతున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ముందుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు కార్యాలయంను అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అక్షాంశ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఎస్పీ రవీందర్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేశ్తో పాటు పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.