భువనగిరి అర్బన్, జూన్ 16 : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాను మోడల్ జిల్లాగా ఎంపిక చేసినందుకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లో నమోదు సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రిలో శానిటేషన్, బ్లడ్ బ్యాంక్, నవజాత శిశువు ప్రత్యేక సంరక్షణలో అందిస్తున్న సేవలు, బాలింత తల్లులకు, పిల్లలకు అందుతున్న సేవలు, ల్యాబ్ లో అందిస్తున్న పరీక్షల వివరాలు, టీ హబ్ లో అందుతున్న సేవల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్స్ భర్తీ చేయుటకు అవకాశాలు గురించి తెలుసుకున్నారు.
ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశం నిర్వహించేందుకు తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయానికి వస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్, ఔట్ పేషంట్ ఎంతమంది పేషంట్లు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న పేషెంట్లను, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ కె.అరుణకుమారి, డాక్టర్ ఏ.జయలక్ష్మి, సహాయ సంచాలకులు, నర్సింగ్ ఆఫీసర్స్, వివిధ శాఖల అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.