తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్బులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామాభివృద్ధి సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.
ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో రెండవసారి పర్యటించి ఇంటింటా తిరిగి ప్రజల ఆర్థిక స్థితిగతులను స్వయంగా పరిశీలించారన్నారు. బీడీ కార్మికులు సీఎం కేసీఆర్ ను ఫించన్ ఇవ్వాలని కోరిన వెంటనే గ్రామంలోని ఆర్హులైన 35మంది లబ్ధిదారులకు ఫించన్లు మం జూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరు నియోజక వర్గంలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారన్నారు.
బీడీ కార్కానా యజమానులతో 2015లోనే సమావేశం నిర్వహించి కార్మికులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని సూచిం చామన్నారు. దేవుడి వలే సీఎం కేసీఆర్ ఇంటింటికి వచ్చి వరాలు అందించడం వాసాలమర్రి ప్రజల అదృష్టమన్నారు. వా సాలమర్రిని దత్తత తీసుకోవడం వల్ల గ్రామాభివృద్ధితో పాటు గ్రామస్తులందరికీ సంక్షేమ పథకాలు అందనున్నాయన్నారు.
వాసాలమర్రిని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధిహామీ పథకంలో కూలీలకు నూతన జాబ్ కార్డులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీల, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడా ల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు రహమత్షరీఫ్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీవో నర్సయ్య, ఉపసర్పంచ్ మధు, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.