రామగిరి, జనవరి 1: సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే ధనుర్మాస కాలం దేవతలకు బ్రహ్మ ముహూర్తం. ఈ పిదప వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఆలయాల్లో ఉత్తర ద్వారంతో భగవంతుడి దర్శనాలు కల్పిస్తారు. ఈ వేడుక కోసం ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం, సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, నల్లగొండ సీతారామచంద్ర ఆలయాలతోపాటు వాడవాడలో ఉన్న వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనానికి ఆయా ఆలయాల కమిటీలు ఏర్పాట్లు చేశాయి.
యాదాద్రి ప్రధానాలయంలో..
యాదాద్రి : వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్ట క్షేత్రం ముస్తాబయ్యాయి. సోమవారం ఉదయం 6.48 గంటలకు యాదాద్రి ప్రధానాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. అలాగే పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా 6.48 గంటలకు వైకుంఠనాథుడి దర్శనం ఇవ్వనున్నాడు. ఉత్సవాల్లో భాగంగా ప్రధానాలయంతో పాటు పాతగుట్టను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, పూలతో ఆలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కమిషనర్ అనిల్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. వీరితో పాటు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉందని ఈఓ గీత వెల్లడించారు.
తొలిసారిగా స్వామివారి ఉత్తరద్వారం గుండా దర్శనం..
యాదాద్రి పునర్నిర్మాణంలో మరో ఘట్టం ఆవిష్కృతం కానుంది. యాదాద్రి చరిత్రలో గతంలో లేని స్వామివారి ఉత్తర ద్వారం అద్భుతంగా నిర్మించగా నేడు స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ద్వితీయ ప్రాకారంలోని పంచతల రాజగోపురం ఐదంస్తతులతో నిర్మించగా ఉత్తర ద్వారాన్ని పూలతో అలంకరించారు. భక్తులు దర్శించుకునే విధంగా ప్రత్యేక స్టీల్ క్యూలైన్లు బిగించారు. వైకుంఠ ఏకాదశిలో గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడంతో మూడు జన్మల వరకు పాపాలన్నీ నశించి, మోక్షం సిద్ధిస్తుందని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.
నేటి నుంచి స్వామివారి అధ్యయనోత్సవాలు..
లక్ష్మీనరసింహస్వామివారి స్వామివారి ఆధ్యయనోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 7 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార పురపాట్ సేవలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.
సోమవారం ఉదయం గరుడ వాహనంపై వైకుంఠ నాథుడు లక్ష్మీనరసింహస్వామివారి అలంకార సేవ, సాయంకాలం మత్స్యావతారం విష్ణుమూర్తి అలంకార సేవ, 3న ఉదయం వేణుగోపాలస్వామి వారి అలంకారం, సాయంకాలం గోవర్ధనగిరిదారి అలంకార సేవ, 4న ఉదయం రామావతార అలంకారం, సాయంకాలం వేంకటేశ్వర స్వామి వారి అలంకార సేవ, 5న ఉదయం వెన్నకృష్ణుడు అలంకారం, సాయంకాలం కాళీయవర్ధనుడి అలంకారసేవ, 6న ఉదయం వటపత్రసాయి అలంకారం, సాయంత్రం వైకుంఠనాథుడు అలంకార సేవ(పరదపద ఉత్సవం), 7న ఉదయం శ్రీ నరసింహస్వామి వారి అలంకార సేవను నిర్వహించి అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వాలు
యాదాద్రి ఆలయ పునర్నిర్మానంతరం తొలిసారిగా జరిగే వైకుంఠ ఏకాదశి పూర్వాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి వారు ప్రధానాలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. దాంతోపాటు ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
– ఆలయ ఈఓ ఎన్. గీత