యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చాయి. మాసాయిపేట గ్రామంలో రిక్డారు స్థాయిలో రూ.11 లక్షల వ్యయంతో 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షించే కంట్రోల్ వ్యవస్థను గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను ప్రభుత్వవిప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునితామహేందర్రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్లు ప్రారంభించారు. 3000 జనాభా ఉన్న గ్రామంలో ఇంతటి భారీ స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేయడం చాల గొప్ప విషయమని, గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు.
గ్రామంలోని అన్ని చోట్ల ఏర్పాటు…
మాసాయిపేట గ్రామంలోని ప్రధాన ప్రదేశాలు, కాలనీలు, అన్ని వార్డులు, గ్రామంలోకి వచ్చే ప్రతి వాహనం కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీని వలన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలవరకు నియంత్రిచ్చవచ్చునని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ఏదైనా దొంగతనం లేదా ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులు ఈ సీసీ కెమెరాలు ఉంటే వాటిని చేపట్టడానికి తప్పకుండా వెనకడుగు వేస్తారని, దీని వలన నేరాల నియంత్రణ చాల వరకు తగ్గుముఖం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి ఎవరొస్తున్నారో…ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది.
రాజాపేట-యాదగిరిగుట్ట రహదారి పూర్తిగా నిఘా వ్యవస్థలో…
మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కెమెరాల వలన యాదగిరిగుట్ట నుంచి రాజాపేట రహదారి పూర్తిగా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థలో చేరిపోయింది. యాదగిరిగుట్ట నుంచి రాజాపేట వైపుకు వెళ్లే ప్రతి వాహనం ఈ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఈ రహదారి మీదుగా ఏవైనా అనుమానాస్పద వాహనాలు ప్రయాణించినా, ఇతరత్రా సమాచారం తెలుసుకోవడం పోలీసులకు చాల సులభతరం అవుతుంది. దీంతో పాటు గ్రామంలో సైతం తిరిగే ప్రతి వాహనం రికార్డు అవుతుంది. దీని వలన గ్రామస్తులకు కూడా చాలా ప్రయోజనం ఉండడంతో పాటు రక్షణ వలయంలో ఉంటారు.