రాజాపేట, మార్చి 16 : రాజాపేట మండలం రఘునాధపురం గ్రామంలో నిషేధిత జాబితాలో చేర్చిన 329 ఇండ్లను వెంటనే నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆ గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిషేధిత జాబితా నుండి తొలగించలేని పక్షంలో బాధితుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. త్వరలోనే బాధితులందరినీ కలుపుకుని తాసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్ను కలిసి బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామన్నారు. ఈ జీఓను గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే జారీ చేసినా ఇప్పటివరకు దాన్ని విడుదల చేయకపోవడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పేద ప్రజల బ్రతుకులతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద ప్రజలను ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయన్నారు. త్వరలోనే బాధితులందరిని కలిసి కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొండం రాజు, మాజీ సర్పంచ్ రామిళ్ల నరేందర్, వార్డు మెంబర్లు తుంగ అక్షయ్ కుమార్, తుంగ సతీష్, నల్ల అశోక్, కలకుంట్ల పోచయ్య, బింగి బాలరాజు, ఆర్కే ప్రభాకర్, కటకం వెంకటేశం, ఉప్పల సిద్ధిలింగం, శెట్టి శ్రీరాములు, బత్తిని పరశురాం, బత్యం కనకరాజు, బొద్దుల శ్రీకాంత్, బొట్టు భాను, సంగిశెట్టి అనిల్, కటకం పృథ్వీరాజ్, ఎడ్ల శ్రవణ్ పాల్గొన్నారు.