నల్లగొండ ప్రతినిధి, (నమస్తే తెలంగాణ) ఫిబ్రవరి 6 : సామాన్యుల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథాన్ని కొనసాగిస్తూనే ఉమ్మడి జిల్లా అభివృద్ధ్దికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర బడ్జెట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపును ఈ ఏడాది కూడా కొనసాగించింది. కీలకమైన పలు ప్రాజెక్టులు ఈ సంవత్సరంలోనే పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నది. వ్యవసాయానికి సమృద్ధిగా, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన మేర నిధులను కేటాయించింది. యాదగిరిగుట్ట ఆలయానికి రూ.200 కోట్లు, రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.500కోట్లు ఇవ్వడంతోపాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును, నల్లగొండ ఐటీ టవర్ను ఈ ఏడాదే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ, పారిశ్రామిక, ఆధ్యాత్మిక, సాంకేతిక, విద్యా, వైద్య రంగాలకు అవసరమైన కేటాయింపులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా కేటాయింపులు కనిపించాయి. కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ను తీసుకువస్తున్నట్లు ప్రకటించడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు స్వాగతిస్తున్నారు.
సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ సవరణ, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3వేల వేతనంపై ఆయా వర్గాలు సంతోష పడుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లుగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కీలకమైన అంశాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తన బడ్జెట్లో ప్రాధాన్యమివ్వడంపై వివిధ వర్గాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ, రాజాపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర శాసనసభలో మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండలోని కీలక ప్రాజెక్టులకు సంబంధించిన స్పష్టత లభించింది. ప్రపంచాన్నే అబ్బుర పరిచేలా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వరుసగా ఈ ఏడాది కూడా నిధులు కేటాయించారు.
ఆలయ ఆభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వ సంకల్పానికి కొనసాగింపుగా కేటాయింపులు ఉండడం విశేషం. దామరచర్ల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం వడివడిగా సాగుతున్నది. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పవర్ప్లాంట్ను పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయి. ఇక నల్లగొండలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనానికి కూడా నిధుల కేటాయింపులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల కోసం రూ.1033 కోట్లు కేటాయించగా, అందులో నల్లగొండ కాలేజీ భవనం కూడా ఉన్నది. రుణమాఫీకి నిధుల కేటాయింపులు మరింతగా పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధిక ప్రయోజనం పొందేది నల్లగొండనే కావడం విశేషం. సంక్షేమరంగంలోనూ భారీ కేటాయింపులతో నల్లగొండకే అధిక లబ్ధి చేకూరనున్నది.
దళితబంధుకు దండిగా నిధులు
యాదాద్రిభువనరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి నుంచి దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా అమలైంది. ఇప్పటివరకు వాసాలమర్రిలో 76కుటుంబాలకు, నియోజకవర్గానికి 100 చొప్పున 1200కుటుంబాలు, తిరుమలగిరి మండలంలో మరో 500కుటుంబాలను దళితబంధు పథకానికి ఎంపిక చేశారు. ఈ ఏడాది సైతం మరింత మందికి వర్తింపజేసేందుకు నిధులు కేటాయించారు. దీంతో దళితుల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
70వేల మందికి ఈహెచ్ఎస్ లబ్ధి
ప్రభుత్వం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 24వేల మంది ఉద్యోగులు, 18వేల మంది ఉపాధ్యాయులు, మరో 28వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉండనున్నట్లు అంచనా. మొత్తం 70వేల మందికి వైద్యచికిత్సలు అందనుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వీటితో పాటు ఇప్పటికే రైతుబంధు ద్వారా రాష్ట్రంలోనే జిల్లాకు అత్యధిక ప్రయోజనం జరుగుతుంది. రైతు బీమాతో ఆర్థికంగా భరోసా పొందిన కుటుంబాలు సైతం జిల్లాలోనే ఎక్కువ. ఆసరా పెన్షన్లు, పల్లె, పట్టణ ప్రగతి, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్డీఎఫ్ లాంటి పథకాలతోనూ ఉమ్మడి జిల్లాకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. రానున్న కాలంలో మిగిలిన ప్రాజెక్టులు, థర్మల్ పవర్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్రోడ్డు, ఐటీ టవర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మెడికల్ కాలేజీ భవనం లాంటివి పూర్తైతే ఉమ్మడి జిల్లా తిరుగులేని అభివృద్ధిని సాధించినట్లవుతుంది. బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.200కోట్లు కేటాయించారు.
బుద్ధవనం మ్యూజియానికి 50 లక్షలు..
బుద్ధవనం ప్రాజెక్టుకు మరోసారి ప్రాధాన్యం లభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులతో దీన్ని తీర్చిదిద్దింది. తాజాగా బుద్ధవనంలో రీజినల్ మ్యూజియం ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ బడ్జెట్లో ఇందుకు రూ.50లక్షలు కేటాయించింది.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఒకటి. దీనికి ఈ ఏడాది సైతం రూ.500కోట్లు కేటాయించింది. ఇప్పటికే యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే ఉత్తరభాగం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలోనే యాదాద్రితో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే దక్షిణ భాగం అలైన్మెంట్ రానుంది. ఇది రాగానే దీనికి సైతం ప్రస్తుతం కేటాయించిన నిధులను వెచ్చించనున్నారు. దీంతో చకచకా ప్రక్రియ ముందుకు సాగనుంది.
నల్లగొండ ఐటీ టవర్..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నిర్మిస్తున్న ఐటీ టవర్ను ఈ ఏడాదే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. నిధులు సమృద్ధిగా ఉండడంతో నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. దీని నిర్మాణంపై ప్రభుత్వం నిత్యం సమీక్షలు చేస్తూ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇది అందుబాటులోకొస్తే ఐటీ ఉత్పత్తులతో పాటు ఉపాధి పరంగా మరింత ముందడుగు పడనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
తొమ్మిది ఉమ్మడి జిల్లా పరిధుల్లో 21 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే జిల్లాలో పలుచోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించిన కార్యచరణ ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరుగనుండడంతో ముందుకు సాగనున్నాయి. దీంతో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు మరింత ఊతమిచ్చినట్లు కానుంది.
దళితుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమ లు చేస్తూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నడు. రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిండం సంతోషదాయకం. బడ్జెట్లో దళితులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రానున్న రోజుల్లో మరింత మందికి దళితబంధుతో లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్గా వినియోగించుకోవడం తప్ప చేసిందేమీ లేదు.. దళితులమంతా సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– పెరుమాళ్ల సతీశ్, ఎల్లాపురం,పాలకవీడు(మం)
అన్ని వర్గాలకు సముచిత బడ్జెట్
బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు 31,426కోట్లు, ఎస్డీఎఫ్కు 10,348కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు 26,831 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు 26,885కోట్లు మొత్తంగా 53,716కోట్లు(18.49శాతం) కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ, దళితబంధు కింద మొత్తం 68,457కోట్లు (23.5) కేటాయించడం హర్షణీయం. ఇది అన్ని వర్గాలకు సముచిత బడ్జెట్.
– బి. సైదులు, ఆర్థిక సామాజిక విశ్లేషకుడు, కోదాడ