తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించి దళితవాడతో పాటు గ్రామంలోని పలు వీధులలో సుమారు 3గంటల పాటు కాలినడకన పర్యటించి గ్రామస్తుల ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అదే క్రమంలో గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించారు.
గ్రామంలో పల్లె ప్రగతి ఫలితాలు పూర్తి స్థాయిలో కనిపించకపోవడంతో అధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పాడుబడిన ఇండ్లు కూల్చి చెత్తాచెదారాన్ని అక్కడే వదిలివేయడం, రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు పెరిగిపోవడం , మురుగు కాల్వల్లో అపరిశుభ్రతను చూసి సీఎం అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. పంచాయతీ సిబ్బంది ఉండి, తగిన నిధులు ఉన్నా ఎందుకు అపరిశుభ్రంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే అదనపు కలెక్టర్ గ్రామం మొత్తం పర్యటించారు. జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో గ్రామంలోని పాడుబడిన ఇండ్ల కూల్చి వేతలు, చెత్తాచెదారం తొలగింపును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామం మధ్యలో ఉన్న మట్టి దిబ్బలను, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై వారికి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎంపీడీవో ఉమాదేవి, ఉప సర్పంచ్ మధు, పంచాయతీ కార్యదర్శి నర్సింహాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు.