యాదాద్రి, నవంబర్ 26 : యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సారథ్యంలో హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రులు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, 5వ వార్డు సభ్యురాలు గుండ్లపల్లి వాణి, 1వ వార్డు కౌన్సిలర్ గౌలికార్ అరుణారాజేశ్, 8వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేశ్ యాదవ్, 6వ వార్డు కౌన్సిలర్ బిట్టు సరోజ భర్త హరీశ్తో పాటు కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరాయిపల్లి ఎంపీటీసీ సామల పద్మావతీ ప్రభాకర్, రాజాపేట మండలం రేణికుంట ఎంపీటీసీ బొద్దుల మౌనికా నగేశ్ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుడుగు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించేలా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునర్నిర్మించారని, కోట్ల రూపాయలతో ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి జరిగాయని, యాదాద్రి జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని తాము టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్కు చెందిన నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల నాయకులు పాండవుల భాస్కర్గౌడ్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి కేటీఆర్ హామీ
యాదగిరిగుట్ట మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు టీఆర్ఎస్లో చేరిన అనంతరం మంత్రి మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరైన మున్సిపాలిటీ కొత్త భవనంతో పాటు ప్రతి వార్డులో ప్రత్యేక డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. దేవస్థానం నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన 30 శాతం ప్రత్యేక గ్రాంట్ వెంటనే విడుదల కానున్నట్లు వివరించారు. ఇప్పటికే వైటీడీఏ ఆధ్వర్యంలో బిగించిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ద్వారా వస్తున్న విద్యుత్ బిల్లు మున్సిపాలిటీకి భారంగా మారిందనే విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వైటీడీఏ అధికారులతో మాట్లాడి, బిల్లులు మున్సిపాలిటీ కాకుండా వైటీడీఏ భరించేలా చూడాలని ఆదేశించారని చెప్పారు. కొన్ని నెలలుగా ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర సాగుతున్నదని, రాబోయే రోజుల్లో మరింత మంది చేరే అవకాశం ఉందని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచ పటంలో నిలపడంతో ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఆలయంతో పాటు యాదగిరిగుట్ట, ఆలేరు పట్టణాలను అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిచారని వివరించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు తావులేదన్నారు. 3 నెలలుగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 7 వేలకుపైగా ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ఆలేరు ప్రజానీకం జై కొడతారని ధీమా వ్యక్తం చేశారు.