యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు. మరోవైపు వాహన దారులకు తిప్పలు తప్పడం లేదు. పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. ఇక డిసెంబర్ 31, జనవరి 1, సంక్రాంతి పండుగలు ఉండటంతో జర్నీకి ఇబ్బందులు తప్పేలా లేవు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరిలో 12.7 డిగ్రీలు, నల్లగొండలో 13.8, సూర్యాపేటలో 16.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. ఈ నెలతోపాటు జనవరి మొత్తం దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేరొంటున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో మంచు తగ్గుముఖం పట్టవచ్చని తెలియజేస్తున్నారు.
రోడ్లు కనిపిస్తలేవ్..
రోడ్లపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. సాయంత్రం నుంచి మంచు ప్రభావం పెరుగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా రోడ్డు కనిపించడం లేదు. ఉదయం 10దాటినా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. దగ్గరికి వచ్చే దాకా ఎదురుగా వచ్చే బండ్లు కానరావడం లేదు. వాహనం ముందు దారుందో, వాహనం ఆగి ఉందో తెలియక అవస్థలు పడుతున్నారు. దాంతో డ్రైవర్లు బికుబికుమంటూ డ్రైవింగ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై వాహన దారులకు తిప్పలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాకు మంగళవారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం కూడా యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. భారీగా పొగమంచు పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
ఆరోగ్యంపై ప్రభావం..
పొగ మంచు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై పంజా విసురుతున్నది. శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హృదయ స్పందనల్లో మార్పులు వస్తాయి. పంటలు, పశు పక్షాదులకు సైతం తీవ్ర నష్టానికి గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు చిన్నపాటి గాలి తగిలినా జలుబు, దగ్గు వంటి రుగ్మతలు దరి చేరుతాయి. చిన్నారులు, ఆస్తమా రోగులుకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇంటి నుంచి బయట వెళ్లకుండా చూసుకోవడం మంచిది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..