Mahalakshmi Scheme | ప్రయాణికుల రవాణాకు బస్సులు సరి పోవడం లేదు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక ప్రాంతాలకూ జనం పోటెత్తుతున్నారు. ఆర్టీసీ మాత్రం ప్యాసింజర్ల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని ప్యాసింజర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్ కార్డుతోపాలు పలు గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉచితంగా రవాణా చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా జిల్లాలో ప్రయాణికుల తాకిడి పెరిగింది.
మహిళలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. స్థానికంగా ఉన్న మహిళలంతా ఒక టీముగా ఏర్పడి ఆలయాలకు క్యూ కడుతున్నారు. రెండో తిరుపతిగా ప్రసిద్ధి పొందిన దివ్య క్షేత్రం యాదగిరిగుట్టను నాటి సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దడంతో స్వామివారిని దర్శించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. గుట్టతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోలు ఉండగా అన్ని రకాల బస్సులు కలిపి 634 నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీతో ఈ బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా భారీగా పెరిగింది. ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నా జిల్లాకు ఎన్ని వస్తాయో చూడాలి మరీ. రద్దీ కారణంగా పిల్లలు, వృద్ధులు బస్సుల్లో నిల్చొని ప్రయాణించక తప్పడంలేదు.
చాలా ప్రాంతాలకు రాత్రి అయితే బస్సులు నడువడం లేదు. జిల్లా కేంద్రాలు, పలు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాత్రి 8 గంటల తర్వాత బస్సులు రాకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. బైపాస్ ఉన్న ప్రాంతాల్లో బస్టాండ్లోకి రాకుండా వెళ్తున్నాయి. నకిరేకల్, నార్కట్పల్లి తదితర ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. బస్సుల సంఖ్య పెంచి, బస్టాండ్లోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.