విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ రూరల్, మే 17 : కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో ట్రస్మా అధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సు, జిల్లా నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ చేసి ఆదుకున్నదని గుర్తు చేశారు. కొవిడ్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాఠశాలలకు స్కూల్బస్ ట్యాక్స్లో వెసులు బాటు కల్పిస్తామన్నారు.
ప్రైవేటు యాజమాన్యాలు అధైర్యపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, రాబోయే రోజుల్లో జిల్లాల్లోనూ ఇంటర్నేషల్ స్కూళ్లు ఏర్పడే అవకాశాలున్నందున పోటీని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ట్రస్మా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా జీవీ రావు, కోశాధికారిగా చెన్నయ్యగౌడ్ను ఎన్నుకున్నారు. వీరిని మంత్రి జగదీశ్రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి మందడి సురేశ్రెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, యానాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, రఘు, సురేశ్, గంట్ల అనంతరెడ్డి, లింగారెడ్డి, ఎంవీ గోనారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు మెరుగు మధు, భాస్కర్రెడ్డి, తిరుమల్రెడ్డి, పాముల అశోక్, అజీజ్ అలీ పాల్గొన్నారు.