చిట్యాల, ఫిబ్రవరి 06 : చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, బీఆర్ఎస్ పాలనలో తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కనకదుర్గ దేవాలయం వద్ద నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థులందరినీ మున్సిపల్ ఎన్నికల బరి నుండి విత్ డ్రా చేయిస్తానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని మున్సిపాలిటీలో 12 వార్డుల్లో గల్లీ గల్లీలో చూపిస్తానని, 25 నెలల తన పాలన ఏమి అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే చూపించాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 8, 11, 12వ వార్డుల్లో చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ కేసీఆర్ పాలనలో చిట్యాల మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఎండగడుతూ ఆయన ఓట్లు అభ్యర్థించారు.

చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చిరుమర్తి లింగయ్య
అబద్ధపు హామీలు, అమలు కాని ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేక ఓటమి భయంతో చేస్తున్న విష ప్రచారాలపై ధ్వజమెత్తారు. ఆయా వార్డుల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదంతో చిట్యాల మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్నీ ప్రజలు గ్రహించారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఆరోపణలు, విష ప్రచారాలు చేసిన ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, అక్రమ కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు భయపడరన్నారు.

చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చిరుమర్తి లింగయ్య
మనం చేసిన మంచి పని, సేవ, మన వ్యక్తిత్వంతోనే ప్రజలు మనల్ని ఆదరిస్తారన్నారు. వయసుకు కూడా గౌరవం లేకుండా స్థాయికి మించి మాట్లాడుతున్నారని, వారు చేసే ప్రతి తప్పుడు ప్రచారానికి తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు మారగోని తేజస్విని, మెండే సుజాత సైదులు, నాయకులు కొలను సతీష్, కన్నెబోయిన బలరాం, దూదిమెట్ల సత్తయ్య, రుద్రారం భిక్షం, చిత్రగంటి ప్రవీణ్, బోల్గురి సైదులు పాల్గొన్నారు.