ఆత్మకూర్.ఎస్, ఆగస్టు 28 : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు.ఎస్ మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కొద్దో గొప్పో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనంచేకూరలేదన్నారు. నేడు వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు ఇస్తున్నామని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందుతూ తల్లిపాలు తాగి రొమ్ము తన్నే విధంగా ఇతర పార్టీల నాయకులు వ్యవహరించడం తగదని చెప్పారు. యావత్ భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. ఆయన మార్గదర్శనంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏడాదికి రూ.12 వేల కోట్లు పింఛన్లకే..
ఆత్మకూర్.ఎస్, ఆగస్టు 28 : రాష్ట్రంలో 60 శాతం కుటుంబాలు ఆసరా పింఛన్లు పొందుతున్నాయని, కానీ, ప్రధాని సొంత రాష్ట్రంలో 20 శాతం కుటుంబాలే పింఛన్లు పొందుతున్నారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో ఆదివారం లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు సాలీనా రూ.800 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక్క పింఛన్లకే సాలీనా రూ.12వేల కోట్లు అందిస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ల పేరుతో రాజకీయం వెలగబెడుతున్న కమలనాథులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లే ట్రబుల్ ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలత, ఏఎంసీ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ సతీశ్, ఎంపీటీసీ ముత్తయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు మర్ల చంద్రారెడ్డి, రాజేంద్రప్రసాద్, మధుసూదన్రెడ్డి, బ్రహ్మం, డీఆర్డీఓ కిరణ్కుమార్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, తాసీల్దార్ హేమమాలిని, ఎంపీడీఓ మన్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో టీఆర్ఎస్ది అందెవేసిన చెయ్యి
మునుగోడు : అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వానిది అందెవేసిన చెయ్యి అని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభివర్ణించారు. మండలంలోని సోలిపురంలో గ్రామస్తుల కోరిక మేరకు మంత్రి జగదీశ్రెడ్డి శనివారం రాత్రి వారితో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్తోపాటు గ్రామస్తులంతా సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రహదారి, వాగు దాటేందుకు బ్రిడ్జి లేక ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోలిపురంలో బ్రిడ్జి, రహదారుల నిర్మాణం వంటి పనులు పేరుకుపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. గ్రామస్తులంతా సీఎం కేసీఆర్ వెంట నడిస్తే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని తెలిపారు. తాజా మాజీ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు పట్టవని, సహజంగా వ్యాపారి అయిన రాజగోపాల్రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారని విమర్శించారు. సోలిపురం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీఇచ్చారు. అనంతరం వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే ఓట్లేస్తామని గ్రామస్తులు ముక్తకంఠంతో తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సైతం వారితో గొంతు కలిపారు. సమావేశంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, గుర్రం సత్యం, ఐతగోని లాల్బహదూర్గౌడ్, రావిరాల కుమారస్వామి పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్దే గెలుపు
చౌటుప్పల్ రూరల్ : మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, బీజేపీది మూడో స్థానమేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లగిరి పరిధిలో గల రిక్కల భాస్కర్రెడ్డి గార్డెన్స్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, నాయకులు బొడ్డు శ్రీనివాస్రెడ్డి, చింతల దామోదర్రెడ్డి, చెన్నగోని అంజయ్యగౌడ్, ముత్యాల ప్రభాకర్రెడ్డి, కొత్త పర్వతాలుయాదవ్, ముప్పిడి శ్రీనివాస్గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, సుర్కంటి శ్రీధర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.