Jharkhand : జార్ఖండ్లో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి విద్యార్థులతో చర్చిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళనపై మాట్లాడారు. ‘‘జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ పరీక్షల అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
పేపర్ లీకేజీ అంశంలో అవకతవకలకు పాల్పడిన నిందితుల్ని గుర్తించాం. వారికి కఠిన శిక్షలు పడతాయి. జార్ఖండ్కు చెందిన అన్ని వర్గాల ప్రజలు, యువత ఆందోళనల్ని మేం పరిగణనలోకి తీసుకుంటాం. బల ప్రయోగం చేయడం, సైన్యాన్ని, బుల్లెట్లు వాడటంకంటే చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని మేం నమ్ముతాం. ’’ అని హేమంత్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. విద్యార్థులు తమ హక్కులు సాధించుకునేందుకు రాజకీయ జోక్యాన్ని నివారించాలని, రాజకీయ పార్టీలు విద్యార్థుల్ని తప్పుదోవపట్టిస్తాయని ఆయన సూచించారు. ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న కీలక విషయం.. ఇటీవల నిర్వహించిన పరీక్షను పూర్తిగా రద్దు చేయడం. రెండోది వీటిపై సీబీఐ విచారణ జరిపించడం.
వీటిలో పరీక్షల రద్దుకు ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తో్ంది. అయితే, సీబీఐ విచారణకే ప్రభుత్వం అంగీకరించడం లేదు. మరోవైపు.. సీఎం మాటల్ని నమ్మి, ప్రభుత్వంతో విద్యార్థులు మళ్లీ చర్చలు జరపాలని జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ కోరారు. సీఎం హామీపై విశ్వాసం ఉంచాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్ విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయదన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళన 16వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.