హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ): ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోకుండానే ఆ ప్రాజెక్టు చేపట్టాలి. బహదూర్గూడ భూముల వాస్తవాలపై సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఆ ప్రాంత రైతుల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తాం’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లాలో రేవంత్రెడ్డి ఎకడెకడ భూములు పోగు చేసుకున్నారో తమ వద్ద పూర్తి సమాచారం ఉన్నదని స్పష్టంచేశారు. తిమ్మాపూర్ భూదాన్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఖరిపై మండిపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసిన 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే తన ఆస్తులు పెరిగాయో, తగ్గాయో అర్థమవుతుందని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎదుట నిరసనలో మహిళా ఎమ్మెల్యేలమైన తాను, సునీతాలక్ష్మారెడ్డికి జరిగిన ఘోర అవమానంపై సీఎం ఎందుకు విచారం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. బుధవారం నాటి శాసనసభలోనైనా సీఎం తమకు క్షమాపణ చెప్తారని ఆశించామని, కానీ ఆ సంసారం రేవంత్లో కనిపించలేదని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అమూల్యమైన సమయాన్ని సీఎం పూర్తిగా వ్యక్తిగత అంశాలు, దూషణలతో దుర్వినియోగం చేశారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నోరుతెరిస్తే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే ఆయన ఏకైక ఎజెండాగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల ఆస్తుల జాబితా కోసం వెతుకోవాల్సిన అవసరం లేదని, అడిగితే తామే ఇచ్చేవాళ్లమని తేల్చి చెప్పారు. గతంలో వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ అంటూ విషప్రచారం చేసిన రేవంత్రెడ్డి, నిన్న అసెంబ్లీలో కేసీఆర్కు ఉన్నది 66 ఎకరాలేనని ఒప్పుకొన్నారని గుర్తుచేశారు.
గతంలో తాను 13 ఏండ్లపాటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని, కానీ ఏనాడూ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే దుస్థితి రాలేదని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిస్థితిని నేడు రేవంత్రెడ్డి సరార్ తీసుకొచ్చిందని, తాను, సునీతా లక్ష్మిరెడ్డి స్వయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచే సీఎం తమను లక్ష్యంగా చేసుకొని ‘మీ బతుకు బస్టాండే’ అంటూ అవమానకరంగా మాట్లాడారని గుర్తుచేశారు.
తన భర్త ఇంద్రారెడ్డి చనిపోయిన తర్వాత 2000లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలోనే తాను ఆ పార్టీలో చేరానని సబితాఇంద్రారెడ్డి వివరించారు. తాను చేసిన సేవలేంటో రంగారెడ్డి జిల్లా ప్రజలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హతే లేదని తెలిపారు. తన కుమారుడు కార్తీక్రెడ్డికి రేవంత్ టికెట్ ఇప్పించలేదని, తాను త్యాగం చేస్తేనే టికెట్ వచ్చిందని, తనను పార్టీ వీడేలా చేసిందే ప్రస్తుత కాంగ్రెస్ నాయకులని వెల్లడించారు. రేవంత్కు నిజంగానే ప్రేమ ఉంటే భట్టి విక్రమారకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ దార్శనికత, సంక్షేమ పథకాల ఆదర్శం రేవంత్రెడ్డికి ఏమాత్రం తెలియదని సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో తాను పనిచేసినప్పుడు ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ఆర్ద్రతను స్వయంగా గమనించానని చెప్పారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి విప్లవాత్మక పథకాలను తెచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజకీయ అనుభవానికి, వయసుకు రేవంత్ విలువ ఇవ్వాలని, సీఎం హోదాకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.