న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: రూ.2,000, అంతకంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్0 చార్జీలను అనుమతించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచే కాక సొంత పార్టీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ వేదికల ద్వారా పదేపదే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే బీజేపీ ప్రముఖ సోషల్ మీడియా సైనికులలో ఒకరైన రిషి బెర్రీ యూపీఐ చెల్లింపులను ఉచితంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని అర్థించారు.
నగదు ముద్రణతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పన్ను వసూళ్లను పెంచడంలో సహాయపడేది కాబట్టి యూపీఐని ఉచితంగానే కొనసాగించాలి అని బెగ్రీ ఎక్స్ పోస్ట్లో కోరారు. యూపీఐ ప్రజా ప్రయోజనమని, దానిని లాభార్జన సాధనంగా ఉపయోగించకూడదని ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ సహ కన్వీనర్ అశ్నీ మహాజన్ ది ప్రింట్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో వాదించారు. ప్రతిపాదిత ఎండీఆర్ చిన్న వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తూనే ఈ చర్య విదేశీ కార్డ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చవచ్చన్న కాంగ్రెస్ విమర్శను కూడా ఆయన పునరుద్ఘాటించారు.

నిర్మలపై నెటిజన్ల సెటైర్లు
నగదును వెంట ఉంచుకునే, లేదా పర్సును భద్రంగా చూసుకునే అవసరం లేకుండా జీవితాన్ని సులభతరం చేయడానికే యూపీఐ పుట్టుకొచ్చింది. యూపీఐ చెల్లింపులకు సంబంధించి కావలసిందిల్లా ఒక మొబైల్ ఫోన్, ఒక క్యూఆర్ కోడ్, వేగంగా పనిచేసే ఇంటర్నెట్ కనెక్షన్, విజయవంతమైన లావాదేవీని సూచించే ఫోన్ స్క్రీన్పై బ్లూటిక్(గుర్తు). అయితే అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి వస్తుండటంతో సోషల్ మీడియాలో కొంతమంది దీనిపై మీమ్స్తో, సెటైర్లతో స్పందిస్తున్నారు.
ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారంలో ఒక ఉన్న ఒక కార్టూన్ ప్రస్తుత పరిస్థితిని చక్కగా తెలియచేస్తుంది. అందులో రెండు పాత్రలు, డిజిటల్ ఇండియాకు సంబంధించిన రెండు విభిన్నమైన సందర్భాల్లు ఉంటాయి. మొదటిది డిజిటల్ ఇండియా, నగదురహితం! అని గర్వంగా ప్రకటిస్తుంది. రెండవది చేతిలో ఫోన్ పట్టుకుని డిజిటల్ ఇండియా! యూపీఐ ఉచితం కాదు! అని బదులిస్తుంది. ఇటీవల ప్రజలను ఇబ్బంది పెట్టిన అంశాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ఓ యూజర్ పెట్టిన పోస్ట్ నవ్వుతోపాటు ఆలోచనను కూడా రేకెత్తించింది. యూపీఐ చార్జీల గురించి మరీ ఎక్కువ ప్రతికూలత వ్యక్తమవుతున్నది.
90% రబ్బరుతో చేసిన పనీర్ను కొనడానికి వెళ్తూ 50% ఇథనాల్ కలిగిన ఇంధనంపై 1% సర్చార్జ్ చెల్లించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆ వ్యక్తి వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మరో వ్యక్తి ఇలా అభ్యర్థించారు. మేడమ్. బాధపైన కూడా ట్యాక్స్ విధించండి.. నాకు ఇంత బాధ అవసరం లేదు. దీనిపై మరో వ్యక్తి స్పందిస్తూ, బాధ పెరిగితే ట్యాక్సు కూడా పెరుగుతుంది సోదరా అని చమత్కరించారు. మరో మీమ్లో నిర్మలా సీతారామన్ వినియోగదారులకు భరోసా ఇస్తూ చింతించకండి. యూపీఐ కొత్త చార్జీలు వ్యాపారులకు మాత్రమే వినియోగదారులకు కాదు అని చెప్పగా దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ ఆంటీ.. వ్యాపారులు ధరలు పెంచి మా దగ్గర నుంచి ఆ చార్జీ వసూలు చేయరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
యూపీఐ చార్జీలపై చర్చించలేదు
పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్నపుడు యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు తాము మద్దతు ఇచ్చామన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ ఖండించారు. ఆర్థిక శాఖ అధికారులు కమిటీ సభ్యులతో సమావేశమైనపుడు యూపీఐ పన్నుకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ప్రతిపాదననూ కమిటీ ముందు ఉంచలేదని గొగోయ్ చెప్పారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ అవసరం గురించి కమిటీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారని ఆయన తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వ ప్రతినిధులు నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. గొగోయ్ వాదనను మనీష్ తివారీ కూడా సమర్థించారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేసే ప్రణాళికకు కమిటీ మద్దతు ఇచ్చిందన్న ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ఎండీఆర్కు సంబంధించిన ఎలాంటి వివరణాత్మక ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచలేదని స్పష్టం చేశారు.