మిర్యాలగూడ టౌన్, నవంబర్ 17 : మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.171.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు రూ.74 కోట్లతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15 కోట్ల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డు, రూ.16 కోట్ల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, మురుగు కాల్వలను ప్రారంభించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.41 కోట్ల బీటీ, సీసీ రోడ్డు పనులను, రూ.15 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ల వరకు ఉన్న డబుల్ రోడ్డును 6 లైన్లుగా మార్చే పనులకు, రూ.3 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీసు ఏరియా సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్ల వ్యయంతో కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్లతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగునీరు అందించే ఆయకట్టులో ఎక్కడా సమస్యలు లేకుండా నీరిస్తామన్నారు. అలాగే మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, ప్రతి వరి రైతుకు న్యాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మెయిన్ కెనాల్ లైనింగ్ కు రూ.57 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాక నియోజకవర్గంలోని దుబ్బ తండ, శాంతినగర్, రావులపెంట చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.24 కోట్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో హ్యామ్ రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ.450 కోట్లు, దేవరకొండ నియోజకవర్గానికి రూ.350 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.65 వేల కోట్లతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్ అండ్ బి రహదారులు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్- విజయవాడ రహదారని రూ.10,500 కోట్లతో చేపట్టనున్నామని, హైదరాబాద్- చిట్యాల రోడ్డు రూ.7,600 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు కోసం రూ.25 లక్షల చెక్కును మంత్రులకు అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో హ్యామ్ రోడ్లను మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నీటి పారుదల కింద చేపట్టిన పనులన్ని పురగతిలో ఉన్నాయని, నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి, అదనపు ఎస్పీ రమేశ్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Miryalaguda Town : మిర్యాలగూడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి