ఆలేరు టౌన్ , జూలై 12 : గోదావరి , కృష్ణానదిలోకి వృధాగా పోతున్నా జలాలను కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరులోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆదివారం ప్రభుత్వ మాజీ విప్, నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పారుతున్నా తెలంగాణను కరువు కాటకాల పాల్జేసేందుకు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మేడి గడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపు హౌజ్ ద్వారా రైతులకు నీరందించే అవకాశం ఉన్నా మూర్ఖత్వంతో పంటలు ఎండబెడుతున్నారని ధ్వజమెత్తారు. కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోయొచ్చని రిటైర్డు ఇంజనీర్లు కూడా చెప్తున్నా రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణ నీటిని, తన గురువు చంద్రబాబు కోసం దిగువకు వదిలిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి వద్ద పారతున్న నీటిని ప్రజలకు చూపడంతో సీఎం బండారం బయటపడి, అచ్చోసిన ఆంబోతులా రంకెలు వేస్తున్నాడన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే తన గురువు చంద్రబాబుకు కోపం వస్తుందని భద్రాచలం రాముడి పేరుతో అబద్ధాలు చెప్తున్నాడన్నారు. ఇప్పటికైనా పంప్హౌస్లు ప్రారంభించి, నీళ్ల ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారని హెచ్చరించారు. సాగునీటి విషయంలో తెలంగాణకు ద్రోహం చేస్తున్న రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా ,రైతు ద్రోహిగా నిలిచిపోతాడని వారు వ్యాఖ్యానించారు. అంతకు ముందు వారు ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ, మండలాధ్యక్షలు పుట్టమల్లేశం గౌడ్, గంగుల శ్రీనివాస్ యాదవ్, మండల సెక్రటరీ జనరల్ రచ్చ రామనర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆడెపు బాలస్వామి, కర్రె అశోక్, ఆరుట్ల లక్ష్మీపతిరెడ్డి, కొలుపుల హరినాధ్, బింగి రవి,మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూర్య, కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీశ్, యాట శివ, సీస మహేశ్వరి, అరుణ, పత్తి వెంకటేష్, జల్లి నర్సంహులు, అయిలి కృష్ణ,ఎండీ ఫయాజ్, గఫూర్ , పూల శ్రవణ్, టింకు, కందుల శ్రీకాంత్,బాల మల్లేష్, ఫిలిప్స్ పాల్గొన్నారు.