నల్లగొండ ప్రతినిధి, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ – వరంగల్ – ఖమ్మం శాసన మండలి నియోజకవర్గంలోని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు పట్టడం లేదు. గత నెల 30 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫిబ్రవరి 6వరకు తుది గడువు ఉండగా.. ఇప్పటి వరకు 72,408 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో నియోజకవర్గ పరిధిలోని జిల్లాల అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 5.05లక్షల మంది ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుతం చాలా తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు.
2021లో పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే ప్రతిసారీ పట్టభద్రులంతా తిరిగి ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో రానున్న ఉప ఎన్నిక కోసం గత నెల 30నుంచి వచ్చే నెల 6 వరకు అర్హులైన పట్టభద్రులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఉంది.
కానీ.. శనివారం నాటికి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 72,408 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 12 జిల్లాలు, 23 రెవెన్యూ డివిజన్లు, 191 మండలాలతో విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పట్టభధ్రులు ఉన్నా ఓటు నమోదుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓటు నమోదుకు 16 రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. మరో లక్ష నుంచి లక్షన్నర దరఖాస్తులు వస్తే ఎక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నిక కోసం అన్ని పార్టీలు, ఆశావహులు రంగంలోకి దిగడంతో రికార్డు స్థాయిలో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 2,81,138 మంది ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నిక కావడంతో ఏ మేరకు ఓటర్ల నమోదు జరుగుతుందో వేచి చూడాలి. పట్టభద్రుల ఓటు నమోదుపై రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకునే ఆశావహులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు జిల్లాల వారీగా అధికార యంత్రాంగం ఓటు హక్కు దరఖాస్తుపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రంగంలోకి దిగింది. శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన మీడియా సమావేశం నిర్వహించి అర్హులైన పట్టభద్రులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.