సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రకటించింది. పదవీ విరమణ వయసును 65ఏండ్లకు పెంచింది. సర్వీస్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ. లక్ష, సహాయకులకు రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించింది. రిటైర్మెంట్ తర్వాత వెంటనే ఆసరా పింఛన్ మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. మినీ అంగన్వాడీలను మొయిన్ అంగన్వాడీలుగా చేయనున్నది. ఈ మేరకు ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు. ఉమ్మడి జిల్లాలో 3,801 మెయిన్, 401 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 8,303 మందికి లబ్ధి చేకూరనున్నది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/నీలగిరి ఆగస్టు 26 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అంగన్వాడీల వ్యవస్థ బలోపేతమైంది. కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి.. గతానికి భిన్నంగా సేవలు అందిస్తున్నారు. చిన్నారులకు బాల్య విద్యను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,801 మెయిన్, 401 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 8,303 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న ఒక్కో టీచర్కు సర్కారు ట్యాబ్స్ ఇచ్చింది. ఇందులోనే పిల్లల హాజరు శాతం, పథకాల అమలు తీరును అప్డేట్ చేస్తున్నారు. పిల్లలు, తల్లుల్లో రక్తహీనత, పోషకాహారం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తల్లులు, పిల్లలకు గుడ్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అంగన్వాడీలకు పదవీ విరమణ వయసు 60 ఏండ్లుగా ఉన్నది. ఇప్పుడు కొత్తగా 65 ఏండ్లకు పెంచారు. అంతేకాకుండా రిటైర్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ వచ్చేవి కావు. ఇక నుంచి సర్వీస్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.లక్ష, సహాయకులకు రూ.50 వేలు అందనున్నాయి. ఇక రిటైర్ అయ్యాక ఆసరా పింఛన్లు పొందనున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ కుటుంబాలు ఉండడం, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మినీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మినీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచరే అన్ని పనులు చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ బోజనం పెట్టడం, రికార్డుల నిర్వహణ, పిల్లల అలనపాలన కేవలం ఒక టీచర్ మాత్రమే నిర్వహించేది. దీంతో వారికి సేవలు కష్టతరమవుతున్నాయని మినీ అంగన్వాడీ కేంద్రాలను సీఎం కేసీఆర్ మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తుంది. దీంతో నల్లగొండ జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలోని 262, యాద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న 4 ప్రాజెక్టుల పరిధిలోని 57 మినీ అంగన్వాడీ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 82 ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ప్రతి కేంద్రానికి హెల్పర్ను నియమించడంతో 401 మందికి ఉపాధి దొరుకుతుంది.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తున్నది. తొమ్మిదేండ్లలో మూడుసార్లు పారితోషికాన్ని పెంచింది. టీచర్కు ప్రతి నెలా రూ.13,650 గౌరవ వేతనాన్ని చెల్లిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు నాటికి అంగన్వాడీ టీచర్లకు కేవలం రూ.4,200మాత్రమే ఉండేది. తెలంగాణతో పోల్చితే ఉత్తరప్రదేశ్లో రూ.7 వేలు, రాజస్థాన్లో రూ.7,500, మహారాష్ట్రలో రూ.8,325 మాత్రమే నెలవారీగా వేతనంగా చెల్లిస్తుండటం గమనార్హం. అంగన్వాడీ హెల్పర్కు తెలంగాణ ఏర్పాటు కంటే ముందు నెలకు రూ.2,200 ఉండగా, ఇప్పుడు రూ.7,800 పొందుతున్నారు. ఇక మినీ అంగన్వాడీలకు నెలకు రూ.2,200 ఉండగా రూ.7,800కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం గుర్తించింది. అంగన్వాడీలకు ప్రసూతి ప్రయోజనాల చట్టం ప్రకారం ప్రసూతి ప్రయోజనాలు మంజూరు చేశారు.
నీలగిరి, ఆగస్టు 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీల పక్షపాతిని మరోమారు రుజువు చేశారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మజ్జిగపు సునీత అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు పుట్ట సునీత, యన్నా శశికళ, నాయకులు జ్యోతి, రజిత, మంగా, గీత, రేణుక, పారిజాత, సత్యవతి,సరిత, నాజిమా పాల్గొన్నారు.
– అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు సునీత
రాష్ట్రంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చిన సీఎం కేసీఆర్, సంఘం గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రుణపడి ఉంటాం. మినీ అంగన్వాడీలు ఏలాంటి ధర్నాలు చేయకుండా సామరస్య పూర్వకంగా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం.
– ఆడెపు వరలక్ష్మి, మినీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు
16 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. కరోనా సమయంలోనే ప్రభుత్వం తీసువచ్చిన టీకాలను వలంటర్లకు వేసుకుని సమాజం మేలుకోల్పేందుకు పనిచేశాం. రాష్ట్ర ప్రభుత్వం మా సేవలను గుర్తించింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
– మందడి సరిత, అంగన్వాడీ టీచర్, ఎస్ఎల్ఎన్ కాలనీ, నల్లగొండ