నల్లగొండ, మే 7 : కొద్దిరోజులుగా తీవ్ర ఎండలు…ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కాస్త ఊరట నిచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురు గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతా ల్లో వర్షం జోరుగా కురిసినప్పటికీ పలు ప్రాంతాల్లో మాత్రం మోస్తరుగా కురిసింది. అయితే వర్షానికి ముందు వచ్చిన ఈదురు గాలులకు చెట్లు కూలడంతో పాటు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోనే సుమారు 3,4 గంటల పాటు విద్యుత్ అంతరాయం కలగగా…ఇతర ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. అత్యధికంగా కనగల్లో 67.8 మిల్లి మీటర్ల వర్షం పడగా మునుగోడులో 47.8, నల్లగొండలో 42.5, కట్టంగూర్లో 40.3, శాలిగౌరారంలో 35.8, నకిరేకల్లో 33.5, నాంపల్లిలో 32.8, గుర్రంపోడులో 29.3, చిట్యాలలో 26.8, చండూర్లో 22.0, పీఏ పల్లిలో 21.5, తిప్పర్తిలో 20.0, అనుములలో 13.8, గట్టుప్పల్లో 12.0, పెద్దవూరలో 12.0, తిరమలగిరి (సాగర్)లో 11.3, కేతేపల్లిలో 10.3, దేవరకొండలో 9.8, కొండ మల్లేపల్లిలో 8.3, చింతపల్లిలో 8.0, చందంపేటలో 5.3, నేరేడుగొమ్ములో 3.3, వేములపల్లిలో 2.8, నార్కట్ పల్లిలో 1.3 మిల్లి మీటర్లవర్షం పడింది.
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలులు, చిరు జల్లులు
సూర్యాపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులతో చిరు జల్లులు పడ్డాయి. అరగంట పాటు భారీ వర్షం పడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనం కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.