జిల్లాలో గణనీయంగా భూగర్భ జలాల వృద్ధి
గతేడాది కంటే 1.05 మీటరు పైకి..
నిండు కుండల్లా చెరువులు
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారంతో సత్ఫలితాలు
సాగుకు ఢోకా లేదంటున్న అధికారులు
యాదాద్రి, జూన్ 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు అలుగుపోశాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వలు పదిలంగా ఉన్నాయి. ఈ ఏడాది వేసవి తాపానికి చెరువుల్లో నీళ్లు ఇంకిపోతాయని రైతులు ఆందోళన చెందారు. కానీ 50 శాతంపైనే చెరువుల్లో నీటి నిల్వలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులు ఉండగా 592 చెరువుల్లో 25 శాతం, 256 చెరువుల్లో 25 నుంచి 50 శాతం, 132 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, మరో 25 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీటి నిల్వలు ఉన్నాయి.
ఐదేండ్లలో 5.34 మీటర్లు పెరుగుదల
జిల్లాలో ఐదేండ్లలో 5.34 మీటర్ల పైకి భూగర్భ జలాలు ఎగబాకాయి. 2017 సంవత్సరానికి ముందు 12.73 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా 2022 మే వరకు 5.34 మీటర్ల పైకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. పల్లెలో ప్రకృతి వనాల ఏర్పాటు, రోడ్లు, వీధుల వెంట విస్తృతంగా నాటిన మొక్కలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతూ వస్తున్నాయి. వ్యవసాయానికి వినియోగించే నీరు సుమారు 30 శాతం భూమిలో ఇంకిపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
మరింత పెరిగే అవకాశం
గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని 95 శాతం చెరువులు మత్తళ్లు పారాయి. 2021 మే నెలలో 8.44 మీటర్ల లోతులో భూగర్భ జలాలుంటే ఈ ఏడాది మే లోపు 7.39 మీటర్లలోనే ఉన్నాయి. అంటే ఈ ఏడాది 1.05 మీటర్ల ఎత్తుకు ఎగబాకాయి. కొన్ని మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు స్వల్పంగా తగ్గాయి. ఇందులో వలిగొండ మండలంలో 0.13 మీటర్ల లోతుకు పడిపోయాయి. చౌటుప్పల్లో 0.28, గుండాలలో 0.6, బీబీనగర్లో 0.47, తుర్కపల్లిలో 1.89, బొమ్మల రామారంలో 2.74 మీటర్ల లోతుకు పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురిసే వర్షాలకు భూగర్భ జలాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నీటి నిల్వకు అనుకూల వాతావరణం
జిల్లాలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయి. సరాసరి 7.39 మీటర్లలో నీరు లభ్యమవుతున్నది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారం, పల్లెప్రకృతి వనాలతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. విస్తారంగా వర్షాలు కురువడంతోపాటు నీటి నిల్వకు చెరువులు, ఇంకుడు గుంతలు అనుకూలంగా మారాయి. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ ఏడాది పంటలకు నీటి ఇబ్బంది లేదు.
–జ్యోతికుమార్, భూగర్భ జలాల శాఖాధికారి, యాదాద్రి భువనగిరి