సూర్యాపేట, మార్చి 19 (నమస్తే తెలంగాణ) ;టీఎస్పీఎస్సీ ఓ స్వతంత్ర సంస్థ. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కల్పతరువు. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న బాడీ. పటిష్ట భద్రత, నిఘాతో కొనసాగుతున్న సంస్థ. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రకారం పేదలకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు, సంఘాలు టీఎస్పీఎస్సీపై పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ విషపూరిత ప్రచారం చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు కొట్టిపారేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పారదర్శకత, నిష్పక్షపాతాన్ని శంకించవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు తెరతీయవద్దని మండిపడుతున్నారు. టీఎస్పీఎస్సీ వచ్చాక 37వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, ఏ ఒక్క రిక్రూట్మెంట్పై కూడా ఆరోపణలు రాలేదని గుర్తు చేస్తున్నారు
స్వతంత్ర సంస్థ అయిన టీఎస్పీఎస్సీ సమర్థంగా నడుస్తున్న కమిషన్. పైరవీలకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో రిక్రూట్మెంట్లు నిర్వహించిన ఈ బోర్డు.. ఒక్క ఆరోపణ లేకుండా 37వేల పోస్టులను భర్తీ చేసింది. కేంద్రంలోని యూపీఎస్సీ, 13రాష్ర్టాల కమిషన్లు అధ్యయనం చేశాయంటే టీఎస్పీఎస్సీ పనితీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇప్పుడు ప్రతిపక్షాలు, సంఘాలు దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. అక్రమాలు జరిగాయని గాయిగాయి చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రతిపక్షాల తీరును టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
వదంతులు నమ్మి సమయం వృథా చేసుకోవద్దు
ఇటీవల టీఎస్పీఎస్సీ సామర్థ్యంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగార్థులు వాటిని నమ్మి సమయం వృథా చేసుకోవద్దు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే ఉద్యోగార్థులు మానసికంగా సంసిద్ధులై ఉండాలి. నేను 2016లో గ్రూప్-2 నోటిఫికేషన్ రాగానే ఉద్యోగమే లక్ష్యంగా సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్తో పాటు న్యూస్ పేపర్లను రెగ్యులర్గా చదివేది. సామాజిక అంశాలను, కరెంట్ ఎఫైర్స్పై దృష్టి పెట్టి ప్రణాళిక ప్రకారం చదివి పరీక్ష రాశాను. అందులో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకు సెలక్ట్ అయ్యాను. గ్రూప్-2 ఉద్యోగం సాధించిన సీనియర్లను అడిగి ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యాను. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు ప్రశాంతమైన వాతావరణంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఇంటర్వ్యూ సంతృప్తికరంగా జరుగడంతో కచ్చితంగా ఉద్యోగం వస్తుందనుకున్నా. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో మంచి ర్యాంకుతో ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో విధులు నిర్వహిస్తున్నా. నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నాను కాబట్టే ఉద్యోగం సాధ్యమైంది. నేను పరీక్ష రాసినప్పటి నుంచి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అత్యంత పారదర్శకంగా జరిగింది. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేకుండా ఎంపిక ప్రక్రియను టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు నీతిగా, నిజాయితీగా నిర్వహించారు.
బాధ్యత మరిచిన ప్రతిపక్షాలు
టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరు చేసిన తప్పులతో నిరుద్యోగులు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ధైర్యం కల్పిస్తూ.. అండగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగార్థులను మరింత ఆందోళనలకు గురిచేస్తూ వారి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. త్వరలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం.. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ పక్క నిరుద్యోగులకు భరోసా కల్పిస్తున్నారు. మరో పక్క రాజకీయ లబ్ధి పొందాలనే దురాశతో కొందరు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కూడై కూస్తున్నది. స్థానికులకే ఉద్యోగాలు రావాలనే సదుద్ద్దేశంతో జోన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా వేలాది మంది కొలువులు సాధించి నేడు సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఇటీవల ఇద్దరు చేసిన తప్పులతో ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసి కేసును సిట్కు అప్పగించిన విషయం విదితమే. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు అదేపనిగా రాజకీయం చేస్తుండడం పట్ల సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో తమ పార్టీకేమీ సంబంధం లేదంటూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణాలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వీడియోలు బయటకు వచ్చిన తరువాత నోరు మూసుకున్నారు. తాజాగా పేపర్ లీకేజీ వ్యవహారంలో సైతం హైదరాబాద్ అమరవీరుల స్థూపం వద్ద డ్రామా చేయడం.. లీకేజీలో పాత్రధారులు బీజేపీ మద్దతుదారులని తేలడంతో నాలుక మడతేసి మరో తీరుగా మాట్లాడడం పట్ల జనం అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వమంటే గిట్టని మీడియా సంస్థలు ప్రతిపక్ష రాజకీయ జోకర్లు చేస్తున్న డ్రామాలను పతాక శీర్శికన ప్రచురిస్తూ మరింత మసాలా పూస్తూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలుమార్లు నోటిఫికేషన్లు వెలువడగా.. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వారు సంతోషంగా ఉన్నారు. పైరవీలు, పేపర్ లీకేజీలు జరిగి ఉంటే తమకు ఉద్యోగం వచ్చేది కాదని, టీఎస్పీఎస్సీ నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని గతంలో ఉద్యోగాలు సాధించిన వారు పేర్కొంటున్నారు.
దిగ్విజయంగా 37వేల పోస్టుల భర్తీ..
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వంతో సంబంధం లేని ఇండిపెండెంట్ బాడీ. దీనికి తొలి చైర్మన్గా ఘంటా చక్రపాణి బాధ్యతలు చేపట్టారు. కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 37వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి ఏపీలో ఏడాదికి రెండు, మూడు రకాల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యేవి. స్వరాష్ట్రంలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా 99 పరీక్షలు నిర్వహించారు. సుమారు నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇన్ని పరీక్షలు నిర్వహించినా ఇప్పటి దాకా ఏ ఒక్క ఉద్యోగ రిక్రూట్మెంట్పై కూడా ఆరోపణలు రాలేదు. పారదర్శకంగా రిక్రూట్మెంట్లు చేపట్టారు. మన టీఎస్పీఎస్సీ పనితీరును చూసి యూపీఎస్సీ రెండు సార్లు సందర్శించి వివిధ అంశాలపై అధ్యయనం చేసింది. దేశంలోని 13 రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సైతం అధ్యయనం చేసి, ఆయా రాష్ర్టాల్లో మన పద్ధతిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోనే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయని విధంగా అత్యధికంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేసింది. ఏకంగా ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత మన కమిషన్ది.
టీఎస్పీఎస్సీలో పైరవీలకు తావు లేదు
రాత్రి, పగలు కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించినా అప్పటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మా రిక్రూట్మెంట్ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన రిక్రూట్మెంట్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టారు. ఎటువంటి పైరవీలకు తావు లేదు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే లక్షల రూపాయలు లంచాలు ఇవ్వాలనే భయం ఉండేది. కానీ.. ఎటువంటి లంచం తీసుకోకుండా నిష్పక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాంతో నాకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నేరేడుచర్ల ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సైతం హాజరై మంచి మార్కులతో క్వాలిఫై అయ్యాను.
– బి.శంకరయ్య, ఎంపీడీఓ, నేరేడుచర్ల
నేను, మా అన్న కొలువులు సాధించాం
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్కు నేను, మా అన్న అప్లయ్ చేసి ఇంటి వద్దే ప్రిపేర్ అయ్యాం. మా అన్న ఇచ్చిన గైడెన్స్తో కరెంట్ అఫైర్స్తోపాటు సబ్జెక్టుల వారీగా బుక్స్ను టైం టేబుల్ను సిద్ధం చేసుకొని చదివాం. రోజుకు సుమారు 12గంటల పాటు రేయింబవళ్లు కష్టపడి చదివి ఎగ్జామ్ రాశాం. 2020లో విడుదల చేసిన ఫలితాల్లో ఇద్దరం ఉద్యోగాలు సాధించాం. నేను ప్రస్తుతం నారాయణపేట్లో డిప్యూటీ తాసీల్దార్గా పనిచేస్తున్నా. మా అన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. టీఎస్పీఎస్సీ బోర్డు ఎవరి ఒత్తిళ్లకూ లొంగదు. ఎవరి ప్రమేయమూ లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ప్రభుత్వం చెప్పింది మాత్రమే నమ్మాలి.
– బట్టు లతారెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ (మాడ్గులపల్లి)
నాకు మూడు ఉద్యోగాలు వచ్చాయి..
దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేనంతగా మంచి పేరు, గుర్తింపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉంది. టీఎస్పీఎస్సీలో ఎలాంటి ప్రలోభాలూ ఉండవు. చైర్మన్తోపాటు సభ్యులు పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు అంతా నమ్మకంగా ఉంటుంది. బీటెక్ చేసిన నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం రెండు సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా. ఆ తరువాత స్టడీ మెటీరియల్ సేకరించుకొని గ్రంథాలయానికి వెళ్లి రోజుకు 12గంటలు చదివాను. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. నేను పరీక్ష రాశా. అందులో ఉట్లపల్లి గ్రామ కార్యదర్శిగా ఎంపికయ్యా. ఆ తరువాత సివిల్ ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. శిక్షణ పొందుతున్న సమయంలోనే వచ్చిన గ్రూప్-2 ఫలితాల్లో ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించాను. టీఎస్పీఎస్సీలో పైరవీలకు గానీ, అవకతవకలకు గానీ ఆస్కారం ఉండదు. కష్టపడి చదివే వారికి మాత్రమే జాబ్స్ వస్తాయి. అభ్యర్థులు భయాందోళనలకు గురి కాకుండా పరీక్షలపై దృష్టి సారించి అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలి.
– స్వర్ణలత, గ్రూప్-2 ఉద్యోగి, శాంతినగర్, మిర్యాలగూడ
పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ బోర్డుల ద్వారా అనేక నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా నియామకాలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ద్వారా 155 నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపు 37వేల పోస్టుల భర్తీ చేసింది. టీఎస్పీఎస్సీలో ఇటీవల జరిగిన లీకేజీ సంఘటన దురదృష్టకరం. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి సంబంధమున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కఠిన నిబంధనలు రూపొందించాలి. ఈ సంఘటనను ఆసరాగా తీసుకొని కొంత మంది విద్యార్థుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. నిరుద్యోగులు వారి ఉచ్చులో పడకుండా పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగార్థుల్లో భరోసా నింపేందుకు ప్రభుత్వం స్టడీ మెటీరియల్స్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతూ స్టడీ సర్కిళ్లు 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టి ఉచిత భోజన సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడం అభినందనీయం.
– భూతం యాకమల్లు, మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
మూడు జాబ్లు వస్తే ట్రాన్స్కోలో జాయిన్ అయ్యా
టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ చాలా పారదర్శకతతో నిర్వహిస్తారు. నేను బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత పోటీ పరీక్షలకు 3నెలలు కోచింగ్ తీసుకున్నా. రోజుకు 10గంటలు చదివాను. 2016లో టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ఎల్పీడీసీఎల్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా.. పరీక్షలకు అటెండ్ అయ్యాను. మూడింటికీ సెలక్ట్ కాగా.. టీఎస్ ట్రాన్స్కోలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ట్రాన్స్కోలో అసిస్టెంట్
ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నా. టీఎస్పీఎస్సీ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవం. టీఎస్పీఎస్సీనోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఎగ్జామ్ నిర్వహించడం, రిజల్ట్ విడుదల చేయడం వరకు అంతా పారదర్శకంగానే జరుగుతుంది. ఎవరూ ఎలాంటి అపోహలకు గురికాకుండా పరీక్షలకు సిద్ధం కావాలి.