హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన హాలియా, నందికొండ మున్సిపాలిటీలను ప్రభుత్వ నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అద్భుతంగా తీర్చిదిద్దుతానని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ తెలిపారు. గురువారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, పాలకవర్గ సభ్యులతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు హాలియా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.150కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షణీయమన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన రూ.15 కోట్లతో హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు అంతర్గత రహదారులు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపడుతామన్నారు.
హాలియాలో ఎడమ కాల్వకు అనుకోని ఉన్న 14ఎకరాల ప్రభుత్వ ఎన్ఎస్పీ స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, ఆడిటోరియం, ఎకరం స్థలంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం షాదిఖాన కబరస్తాన్ ఏర్పాటు చేస్తామన్నారు.
హాలియా మున్సిపాలిటీ పాలకవర్గం కోలువుతీరిన 20నెలల్లో ప్రభుత్వం సుమారు 17కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు హాలియా మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు హాలియా మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రజలను తప్పుదారి పట్టిస్తూ పబ్బం గడపుతున్నారని విమర్శించారు.. ఇంతకాలం హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఎందుకు తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. హాలియా మున్సిపాలిటీ అభివృద్ధిపై కాంగ్రెస్, ఇతర పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహాకరించాలని హితవు పలికారు.
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలు ప్రభుత్వంతో కలసి రావాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మండల పార్టీ అధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మున్సిపల్ ప్లోర్ లీడర్ వర్రా వెంకట్రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీను, ప్రసాద్ నాయక్, రావుల లింగయ్య, చాపల సైదులు, అన్వరుద్దీన్, చేరుపల్లి ముత్యాలు, సురభి రాంబాబు పాల్గొన్నారు.