ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం దళిత బంధు యూనిట్లను ప్రారంభించి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఉద్యమ సమయంలో అందరి కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకే కేంద్ర పార్టీల నాయకులు జీర్ణించుకోలేక తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు. విపక్షాలు ఎన్ని కుప్పిగంతులు వేసినా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరన్నారు.
సూర్యాపేట టౌన్, మే 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఎవ్వరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని, కేవలం ఎనిమిదేండ్లలోనే నిరుపేద, బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటూ.. వారి కన్నీళ్లు తూడ్చి ఆనందం నింపుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దళితబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 37, 45, 25 వార్డుల్లో 9 మంది లబ్ధిదారులకు రూ.90లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన దళితబంధు యూనిట్లను మంత్రి ప్రారంభించారు. డా.బీఆర్ అంబేద్కర్తో పాటు ఎందరో మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. సకల వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని అందుకే జాతీయ పార్టీలు జీర్ణించుకోలేక తెలంగాణపై విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్పిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, వార్డు కమిటీలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు తాము ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రత్యేకంగా అలంకరించుకుని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మంత్రి జగదీశ్రెడ్డికి ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.
ఆకలి, చీకట్లు లేని తెలంగాణ
గులాబీ జెండా, సీఎం కేసీఆర్తోనే బతుకులు మారాయి
సూర్యాపేట రూరల్, మే 7 : సీఎం కేసీఆర్ పాలనలో ఆకలి, చీకట్లు లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంత్రి శనివారం రాత్రి మండల పరిధిలోని ఇమాంపేట, బాలెంల గ్రామాల్లో సుమారు 100 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించి మాట్లాడారు. ఆంధ్రా పార్టీల జెండాలు మోసి ఆగమైతే గులాబీ జెండా, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బతుకులు మారాయన్నారు. గత ప్రభుత్వాలు నిరుపేదల ఆడపిల్లల సంక్షేమం పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఆడబిడ్డకూ పెండ్లి ఖర్చులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సంగాని జనార్దన్, ఎంపీటీసీ మామిడి కిరణ్, సర్పంచులు పాముల హనుమంతు, వాంకుడోతు స్వప్నానాగరాజు, పులగం స్వాతీరాఘవరెడ్డి, హేమలత, అశోక్, నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు ముదిరెడ్డి సంతోష్రెడ్డి, కుంభం వెంకన్నయాదవ్, మాలి అనంతరెడ్డి, ఈదుల యాదగిరి చౌగోని సంతోశ్గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంఘర్షణ
60ఏండ్లుగా తెలంగాణ ప్రజల ఉసురు తీసింది
రాహుల్గాంధీ మాటల్లో నిజం లేదని ప్రజలకు అర్థమైంది..
విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
పెన్పహాడ్, మే 7 : కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి 60ఏండ్లుగా తెలంగాణ ప్రాంత ప్రజల ఉసురుతీసిన ఆ పార్టీలో నాయకత్వ సంఘర్షణ నెలకొన్నదని మంత్రి పేర్కొన్నారు. మండల పరిధిలోని మాచారంలో రూ.5లక్షలతో చేపట్టిన బస్ షెల్టర్ను మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం 148మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాయకత్వ పదవుల కోసం ఆరాట పడుతున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్టులో చిలుక పలుకులు తప్ప వరంగల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదని ప్రజలకు తేట తెల్లం అయ్యిందన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనాను రూపొందించే అవకాశం ఒక్క కేసీఆర్తో మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. రాదనుకున్న తెలంగాణను తేవడమే కాదు.. 24గంటల విద్యుత్, ప్రతి ఎకరాకూ నీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, సర్పంచ్లు బొల్లక సైదమ్మ, బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, చెన్ను శ్రీనివాస్రెడ్డి, బిట్టు నాగేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు నాతాల జానకీరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, దొంగరి యుగేంధర్, రఫి, తూముల ఇంద్రసేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, చిత్తరంజన్, బొల్లక సైదులు, భరత్, స్వర్ణ, పొదిల నాగార్జున, గుర్రం అమృతారెడ్డి, మహీంద్రా రాజు, మాజీ ఎంపీపీ పద్మ, బొల్లక లింగయ్య, చెన్ను సుదర్శన్రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, ఆవుల అంజయ్య పాల్గొన్నారు.