OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)’ విడుదలై దాదాపు పది నెలలు గడిచినా.. ఆ సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని పవన్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలవడానికి కారణం.. టెలివిజన్ ప్రీమియర్తో పాటు సీక్వెల్కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్. ఇప్పటివరకు ఈ చిత్రం శాటిలైట్ హక్కులపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ ఈ సినిమా టెలివిజన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ఛానెల్లో ప్రత్యేక ప్రోమోలు ప్రసారం అవుతుండగా.. ఆగస్టులో వచ్చే ఓ ప్రముఖ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనున్నట్లు సమాచారం. దీంతో బుల్లితెరపై ‘ఓజీ’ని చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే వార్త ఏమిటంటే.. ‘ఓజీ 2’ తెరకెక్కించే దిశగా అధికారిక చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ను రూపొందించాలనే ఆసక్తిని స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం ముగిసిన తీరు కూడా రెండో భాగానికి మంచి అవకాశాన్ని కల్పించడంతో, కథ అభివృద్ధిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఈసారి సీక్వెల్ను పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్పై నిర్మించనున్నట్లు సమాచారం. దర్శకుడు సుజీత్ మరోసారి మెగా ఫోన్ పట్టనుండగా.. సంగీత దర్శకుడు ఎస్. థమన్ కూడా సీక్వెల్కు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రాథమిక చర్చల దశలో ఉండగా.. కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ తదితర అంశాలపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ‘ఓజీ’ విజయంతో భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో, రెండో భాగాన్ని మరింత గ్రాండ్గా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.