Jana Nayagan | దళపతి విజయ్ చివరి చిత్రంగా రూపొందిన ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. రాజకీయ, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 23న తమిళంతో పాటు తెలుగు (‘జన నాయకుడు’), హిందీ (‘జన్ నేత’) భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు బ్లాక్బస్టర్ ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే ప్రచారంపై దర్శకుడు హెచ్. వినోత్ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన హెచ్. వినోత్.. ‘జన నాయగన్’ పూర్తిస్థాయి రీమేక్ కాదని స్పష్టం చేశారు. “ఈ సినిమాలో కొన్ని భావోద్వేగ అంశాలు, మహిళా సాధికారతకు సంబంధించిన కాన్సెప్ట్ మాత్రమే ‘భగవంత్ కేసరి’ నుంచి ప్రేరణ పొందాయి. మొదటి భాగంలో కొంత పోలిక కనిపించినా, రెండో భాగం పూర్తిగా భిన్నంగా ఉంటుంది” అని తెలిపారు.
‘నేర్కొండ పార్వై’ తర్వాత మరోసారి రీమేక్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని వినోత్ వెల్లడించారు. అయితే విజయ్ స్వయంగా ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని 5 సార్లు వీక్షించి, అందులోని మహిళా సాధికారత అంశం తనకు బాగా నచ్చిందని చెప్పడంతో, అదే భావాన్ని కొత్త కథలో భాగంగా తీసుకున్నట్లు వివరించారు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి, విజయ్ ఇమేజ్కు అనుగుణంగా కథను పూర్తిగా కొత్తగా మలిచామని చెప్పారు. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ పాత్ర శ్రీలీలను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దే నేపథ్యం ఉంటే.. ‘జన నాయగన్’లో విజయ్, మమితా బైజూ పాత్రల మధ్య కూడా అలాంటి భావోద్వేగ బంధాన్ని కొత్త కోణంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా కథ, పాత్రల రూపకల్పన పూర్తిగా భిన్నంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజూ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట ప్రకటించిన విడుదల తేదీ వాయిదా పడిన తర్వాత ఇప్పుడు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘జన నాయగన్’ నిజంగా ‘భగవంత్ కేసరి’కి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? లేక పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తుందా? అన్నది సినిమా విడుదల తర్వాతే తేలనుంది.