ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీ నోరీన్ నియాజి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో పాకిస్థాన్ ఆర్మీ దేశ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసినట్లు ఆమె ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ వేళ విజయం సాధించినట్లు పాకిస్థాన్ ఆర్మీ ఓ కల్పిత వార్తలను అల్లినట్లు ఆమె పేర్కొన్నారు. కానీ వాస్తవానికి పాకిస్థాన్ ఆర్మీ చావుదెబ్బ తిన్నట్లు ఆమె చెప్పారు. యుద్ధంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే పాక్ ఆర్మీ ప్రయత్నించినట్లు ఇమ్రాన్ సోదరి నోరీన్ ఆరోపించారు. నాలుగు రోజుల పాటు జరిగిన సమయంలో ఆర్మీ జనరల్స్, నాయకులు చెప్పినట్లు పాకిస్థాన్ విజయం సాధించలేదన్నారు. కానీ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారీ విజయాన్ని నమోదు చేసిందన్నారు. ఓటమిని దాచిపెట్టేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నించిందన్నారు.
ఇమ్రాన్ సోదరి నోరీన్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ జాతీయ సైబర్ దర్యాప్తు సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దేశ మిలిటరీ, ప్రభుత్వ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమెకు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు ఆమెను విమర్శించారు. యుద్ధం మరింత ఉదృతం కాకుండా ఉండేందుకు భారత్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిందని, ఇజ్రాయిల్తో ఉన్న అవగాహన ప్రకారం భారత్ నడుచుకున్నట్లు నియాజీ తెలిపారు. ఇక మార్కా ఈ హక్ ఆపరేషన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్ల పాకిస్థాన్ వెనక్కి తగ్గినట్లు ఆమె చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి నియాజీ చేసిన వ్యాఖ్యలను పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది.